RBI: ఫిన్​టెక్‌ కంపెనీలు అందరికీ అందుబాటులో ఉండే సేవలందించాలి: ఆర్​బీఐ గవర్నర్​

by S Gopi |

అందరికీ అందుబాటులో ఉంటూనే, సులభంగా ఉపయోగించేలా సేవలను, ఉత్పత్తులను ఫిన్‌టెక్ కంపెనీలు అందించాలి.

RBI: ఫిన్​టెక్‌ కంపెనీలు అందరికీ అందుబాటులో ఉండే సేవలందించాలి: ఆర్​బీఐ గవర్నర్​
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం, సురక్షితంగా మార్చే లక్ష్యంతో సేవలందించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఫిన్‌టెక్ కంపెనీలకు సూచించారు. బుధవారం గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2025లో మాట్లాడిన ఆయన.. అందరికీ అందుబాటులో ఉంటూనే, సులభంగా ఉపయోగించేలా సేవలను, ఉత్పత్తులను ఫిన్‌టెక్ కంపెనీలు అందించాలి. దేశంలో ఫిన్‌టెక్ కంపెనీలకు అవసరమైన స్థాయిలో అత్యంత మెరుగైన ఎకోసిస్టమ్ ఉంది. ఇప్పటికే ఈ రంగంలో సుమారు 10,000 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఫిన్‌టెక్ కంపెనీల కారణంగానే దేశంలో ఇప్పుడు ఆర్థిక సేవలు తక్కువ ధరలో లభిస్తున్నాయి. కానీ, డిజిటల్ మోసాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇది ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. కొత్త జనరేషన్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ)ని మెరుగుపరిచే సామర్థ్యం ఏఐకి ఉందని సంజయ్ మల్హోత్రా తెలిపారు.

ఈ సందర్భంగా ఫిన్‌టెక్ కంపెనీలకు కీలకమైన మార్గదర్శక సూత్రాలను ఆర్‌బీఐ గవర్నర్ వివరించారు. అవి.. దేశ అభివృద్ధిలో వెనుకబడి ఉన్న ప్రాంతాల్లో సైతం ఫిన్‌టెక్ కంపెనీలు విస్తరించే చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా డిజిటల్ అక్షరాస్య తక్కువగా ఉన్నవారు కూడా ఉపయోగించేలా ఆర్థిక ఉత్పత్తులు, సేవలను అందించాలి. కస్టమర్ ఫస్ట్ విధానాన్ని అనుసరిస్తూ, ఇబ్బందుల్లేని సేవలందించాలి. అలాగే, కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఫిన్‌టెక్ కంపెనీలు చిన్న వ్యాపారులు కూడా సులభంగా డిజిటల్ చెల్లింపులు చేసేలా సేవలను తీసుకురావాలన్నారు. కస్టమర్లలో నమ్మకాన్ని పెంచేలా డేటా భద్రత, పారదర్శకత కలిగిన ఉత్పత్తులను తీసుకురావాలి. కొత్తగా ప్రారంభించే ఉత్పత్తులు, సేవలను గ్లోబల్ స్థాయిలో ఆలోచించి రూపొందించాలి. దానికొసం ప్రపంచ భాగస్వామ్యం కలిగిన కంపెనీలతో నాలేడ్జ్ షేరింగ్ జరగాలని సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.

Next Story