RBI: బంగారం అమ్మలేదు

by S Gopi |

ఆర్‌బీఐ దాదాపు 100 టన్నుల బంగారాన్ని విక్రయించినట్టు బ్లూమ్‌బర్గ్ ప్రచురించిన కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.

RBI: బంగారం అమ్మలేదు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) భారీగా బంగారం విక్రయించిందంటూ మార్కెట్లో వస్తున్న వార్తలను సెంట్రల్ బ్యాంకు ఖండించింది. ఫారెక్స్ నిల్వలను కాపాడుకునేందుకు ఆర్‌బీఐ దాదాపు 100 టన్నుల బంగారాన్ని (సుమారు 12 బిలియన్ డాలర్ల విలువైన నిల్వలను) విక్రయించినట్టు బ్లూమ్‌బర్గ్ ప్రచురించిన కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అధికారిక లెక్కల ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఆర్‌బీఐ వద్ద ఉన్న భౌతిక బంగారు నిల్వలు 880.52 టన్నుల వద్ద సురక్షితంగా, యథాతథంగా ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఈ నిల్వలు తగ్గకపోగా.. 2025, మేలో ఉన్న 879.58 టన్నుల నుంచి క్రమంగా పెరుగుతూ ఈ స్థాయికి చేరింది.

అయితే, పరిమాణం పరంగా బంగారం పెద్దగా పెరగకపోయినా, అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు భారీగా పెరగడం వల్ల ఆర్‌బీఐ వద్ద ఉన్న గోల్డ్ రిజర్వ్ విలువ గత ఏడాది కాలంలో 40 బిలియన్ డాలర్లు పెరిగి 120 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో దేశ విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్) నిల్వలు కూడా 658 బిలియన్ డాలర్లకు పెరిగాయి. రూపాయి విలువను కాపాడటం కోసం ఆర్‌బీఐ గడిచిన ఆర్థిక సంవత్సరంలో స్పాట్ ఫారెక్స్ మార్కెట్లో నికరంగా 53.13 బిలియన్ డాలర్లను విక్రయించింది. ఒకే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బ్యాంక్ ఇంత భారీ స్థాయిలో డాలర్లను విక్రయించడం భారత బ్యాంకింగ్ చరిత్రలోనే ఇదే తొలిసారి.

Next Story