రిలయన్స్ రిటైల్‌లో మైనారిటీ వాటా కోసం ఖతార్ సావరిన్ వెల్త్‌ఫండ్ చర్చలు!

by Disha Web Desk 17 |
రిలయన్స్ రిటైల్‌లో మైనారిటీ వాటా కోసం ఖతార్ సావరిన్ వెల్త్‌ఫండ్ చర్చలు!
X

ముంబై: దేశీయ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ విభాగంలో ఖతార్ సావరిన్ వెల్త్‌ఫండ్ మైనారిటీ వాటాను కొనేందుకు ముందస్తు చర్చలు జరుపుతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దానికోసం ఖతార్ సావరిన్ వెల్త్‌ఫండ్ సుమారు రూ. 8,200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు సమాచారం.

ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉంది. అందులో భాగంగానే రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో సుమారు 1 శాతం వాటా కొనేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని, రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నేతృత్వంలో చర్చలు జరుగుతున్నాయని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

ఇప్పటికే రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(పీఐఎఫ్) 2.04 శాతం వాటాను కలిగి ఉండగ, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ(ఏడీఐఏ) 1.2 శాతం వాటా, యూఏఈకు చెందిన ముబదలా 1.4 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో దాని మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ 85 శాతం వాటాను కలిగి ఉంది.

దేశీయ దిగ్గజ రిటైల్ కంపెనీగా ఉన్న రిలయన్స్ రిటైల్ కిరాణా సరుకుల నుంచి ఫ్యాషన్ వరకు వేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా దేశీయ మార్కెట్లో గ్లోబల్ బ్రాండ్ల ఫ్రాంచైజీ హక్కులను పొందడం ద్వారా వ్యాపారాన్ని దూకుడుగా విస్తరిస్తోంది.


Next Story

Most Viewed