పేటీఎంకు మద్దతుగా నిలిచిన స్టార్టప్ ఫౌండర్లు

by Dishanational1 |
పేటీఎంకు మద్దతుగా నిలిచిన స్టార్టప్ ఫౌండర్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆంక్షల నేపథ్యంలో సుమారు డజను మంది స్టార్టప్ వ్యవస్థాపకులు పేటీఎంకు మద్దతుగా నిలిచారు. ఈ అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వంతో పాటు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)కి కోరారు. అలా చేయకుంటే దేశీయ ఫిన్‌టెక్ రంగం మొత్తం ప్రభావితం అవుతుందని, ప్రతికూల సంకేతాలు ఈ రంగాన్ని ఒత్తిడిలోకి నెట్టేస్తాయని ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐకి లేఖను అందజేశారు. ఈ మేరకు భారత్ మ్యాట్రిమోనీ, కేపిటల్ మైండ్ సహా పలు స్టార్టప్ కంపెనీలకు చెందిన ఫౌండర్లు లేఖపై సంతకం చేశారు. ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు కఠినంగా ఉన్నాయని, దీనివల్ల పేటీఎం మాత్రమే కాకుండా సంబంధితం రంగంపై ఒత్తిడిని ఏర్పడుతుందని వారు వివరించారు. పరిస్థితి తీవ్రతను తగ్గించేందుకు అవకాశాలను పరిగణలోకి తీసుకోవాలని, కంపెనీతో సంప్రదింపులు చేపట్టి లోపాలను సవరించే వీలును కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో పేటీఎం వ్యాలెట్ వ్యాపారాన్ని జియో కొనుగోలు చేస్తోందనే వార్తలు చర్చకు వచ్చాయి. దీనిపై స్పందించిన జియో ఫైనాన్షియల్, అలాంటి ప్రయత్నాలేమీ జరగలేదని, ఏదైనా ఉంటే తామే ప్రకటన జారీ చేయనున్నట్టు వెల్లడించింది.



Next Story