- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Crude Oil: మళ్లీ మంటల్లో పశ్చిమాసియా
అదే సమయంలో ఇరాన్ ముడి చమురు అమ్మకాలకు ఇచ్చిన సాధారణ లైసెన్సును అమెరికా రద్దు చేయడంతో, రెండు దేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు భయాలు మార్కెట్ను కుదిపేశాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లో ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న మూడు నౌకలపై ఇరాన్ దాడి చేసినట్లు అమెరికా ఆరోపించగా, దీనికి ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. అదే సమయంలో ఇరాన్ ముడి చమురు అమ్మకాలకు ఇచ్చిన సాధారణ లైసెన్సును అమెరికా రద్దు చేయడంతో, రెండు దేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు భయాలు మార్కెట్ను కుదిపేశాయి. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిలో మళ్లీ అంతరాయం ఏర్పడే అవకాశం ఉందన్న ఆందోళనలతో బ్రెంట్ క్రూడ్ ధర 1.9 శాతం పెరిగి బ్యారెల్కు 75.54 డాలర్లకు, అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్ 1.9 శాతం ఎగిసి 71.81 డాలర్లకు చేరింది. అంతకుముందు మంగళవారం కూడా ఈ రెండు దాదాపు 3 శాతం పెరగడం గమనార్హం.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగితే ప్రపంచ చమురు సరఫరాపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రపంచ ఇంధన సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుండటంతో, అక్కడ ఏ అంతరాయం వచ్చినా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఇటీవల శాంతి ఒప్పందం తర్వాత ధరలు తగ్గుతాయని భావించి వ్యాపారులు భారీగా షార్ట్ పొజిషన్లు తీసుకున్నప్పటికీ, తాజా పరిణామాలు ఆ అంచనాలను తారుమారు చేశాయి. మరోవైపు, అమెరికాలో ముడి చమురు నిల్వలు వరుసగా తగ్గుతుండటం కూడా ధరలకు మద్దతు ఇస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్య పరిణామాలు, హోర్ముజ్ జలసంధిలో నౌకాయానం పరిస్థితులు, అమెరికా-ఇరాన్ సంబంధాలే అంతర్జాతీయ చమురు మార్కెట్ దిశను నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయి.






