60 వేలకు చేరువలో సెన్సెక్స్!

by Disha Web Desk 7 |
60 వేలకు చేరువలో సెన్సెక్స్!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మెరుగైన లాభాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా గత వారాంతం విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణంతో పాటు మంగళవారం వచ్చిన సానుకూల టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు సూచీల జోరును పెంచాయి. రిటైల్‌తో పాటు టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాబోయే నెలలో జరిగే ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్ల పెంపుపై పునరాలోచించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. చైనా, అమెరికాల గణాంకాలు బలహీనంగా ఉండటంతో గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా పరిణామాలు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి.

దీంతో వరుసగా ఐదవ వారంలో స్టాక్ మార్కెట్లు లాభాలను కొనసాగించడంతో సెన్సెక్స్ 60 వేల కీలక స్థాయిలకు చేరువగా ర్యాలీ అవుతోంది. దేశీయ సంఘటనల మద్దతుతో పాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత ఈక్విటీల్లో పెట్టుబడులను పెంచడం కలిసొచ్చింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 379.43 పాయింట్లు ఎగసి 59,842 వద్ద, నిఫ్టీ 127.10 పాయింట్లు పెరిగి 17,825 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, రియల్టీ, ఎఫ్ఎంసీజీ రంగాలు గణనీయంగా పుంజుకోగా, పీఎస్‌యూ బ్యాంక్, మీడియా రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, మారుతీ సుజుకి, ఏషియన్ పెయింట్, హిందూస్తాన్ యూనిలీవర్, ఆల్ట్రా సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీంద్రా షేర్లు అధిక లాభాలను సాధించాయి. ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫినాన్స్, టీసీఎస్, ఎన్‌టీపీసీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 79.32 వద్ద ఉంది.

ప్రధాన నగరాల్లో సగటున 5 శాతం పెరిగిన ఇళ్ల ధరలు!


Next Story

Most Viewed