విలీన ఒప్పందం రద్దు వ్యవహారంలో సోనీకి ఎన్‌సీఎల్‌టీ నోటీసులు

by Dishanational1 |
విలీన ఒప్పందం రద్దు వ్యవహారంలో సోనీకి ఎన్‌సీఎల్‌టీ నోటీసులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకున్న వ్యవహారంలో జపాన్‌కు చెందిన సోనీపై జీ ఎంటర్‌టైన్‌మెంట్ దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) విచారణకు అంగీకరించింది. ఈ మేరకు జీ ఎంటర్‌టైన్‌మెంట్(జీల్) షేర్ హోల్డర్ మ్యాడ్‌మెన్ ఫిల్మ్ వెంచర్స్ దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి ఎన్‌సీఎల్‌టీ సోనీకి నోటీసులను జారీ చేసింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సూచిస్తూ, తదుపరి విచారణను మార్చి 12కు వాయిదా వేసింది. 2023 ఆగష్టులో ఎన్‌సీఎల్‌టీ ఆమోదించిన విలీనాన్ని అమలు చేయాలని జీల్, సోనీ కంపెనీలను అభ్యర్థిస్తూ మ్యాడ్ మెన్ ఫిల్మ్ వెంచర్స్ మంగళవారం పిటిషన్‌ను దాఖలు చేసింది. ఇదే సమయంలో సోనీపై సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లో వేసిన పిటిషన్ బుధవారం(జనవరి 31న) అత్యవసర విచారణకు రావొచ్చని తెలుస్తోంది. ఈ పరిణామాలతో భారత ఈక్విటీల్లో జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు మంగళవారం ఒక్కరోజే 5.7 శాతం పెరిగి రూ. 171 వద్ద ముగిసింది. కాగా, ఇటీవల జీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సోనీ ఇండియా చేసుకున్న రూ. 83 వేల కోట్ల విలువైన విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు సోనీ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలోనే జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎన్‌సీఎల్‌టీ వద్దకు వెళ్లింది. మరోవైపు సింగపూర్ ఆర్బిట్రేషన్‌ను సైతం ఆశ్రయించింది.



Next Story