మరోసారి రిలయన్స్ కేపిటల్ ఆస్తుల వేలానికి ఎన్‌సీఎల్ఏటీ అనుమతి!

by Disha Web Desk 17 |
మరోసారి రిలయన్స్ కేపిటల్ ఆస్తుల వేలానికి ఎన్‌సీఎల్ఏటీ అనుమతి!
X

ముంబై: దివాలా సమస్యలో ఉన్న రిలయన్స్ కేపిటల్ ఆస్తుల వేలం ప్రక్రియకు మరో రౌండ్ బిడ్డింగ్‌ను జాతీయ కంపెనీల చట్టం అప్పిలేట్ ట్రెబ్యునల్(ఎన్‌సీఎల్ఏటీ) అనుమతిచ్చింది. ఈ క్రమంలోనే రిలయన్స్ కేపిటల్‌పై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆంక్షలు విధించిన ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలను పక్కనబెట్టింది. దివాలా ప్రక్రియలో ఉన్న ఆస్తుల విలువ పెంచేందుకు, చర్చలు నిర్వహించేందుకు కమిటీ ఆఫ్ క్రెడిటార్స్‌కు అధికారం ఉందని, రెండు వారాల అనంతరం బిడ్లను ఆహ్వానించాలని సూచించింది.

ఎన్‌సీఎల్‌టీ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ రిలయన్స్ కేపిటల్ రుణ సంస్థలు ఎన్‌సీఎల్ఏటీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 21న ఆర్థిక బిడ్లకు గడువు ముగియగా, రూ. 8,640 కోట్లకు టొరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అధిక బిడ్‌ను వేసినట్టు ఫిబ్రవరి 2న ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌కు తెలిపింది.

దీనిపై రిలయన్స్ కేపిటల్‌కు రుణాలిచ్చిన విస్ట్రా ఐటీసీఎల్ సవాలు చేస్తూ ఎన్‌సీఎల్ఏటీ ముందుకెళ్లింది. మరోసారి వేలం నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని, దివాలా ప్రక్రియలో ఉన్న ఆస్తుల విలువను మరింత పెంచుకునే ప్రయత్నాలు చేస్తామని కోరగా, దీనికి ఎన్‌సీఎల్ఏటీ అనుమతి ఇస్తున్నట్టు పేర్కొంది.



Next Story

Most Viewed