భారత జీడీపీ వృద్ధి అంచనాను పెంచిన మోర్గాన్ స్టాన్లీ

by Dishanational1 |
భారత జీడీపీ వృద్ధి అంచనాను పెంచిన మోర్గాన్ స్టాన్లీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ భారత వృద్ధి అంచనాలను సవరించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన దేశ జీడీపీని అంచనాలను 6.5 శాతం నుంచి 6.8 శాతానికి పెంచుతున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల, నిరంతరం కొనసాగుతున్న మూలధన వ్యయం నేపథ్యంలో వృద్ధి అంచనాను పెంచినట్టు మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదికలో వెల్లడించింది. దేశీయ డిమాండ్ కూడా స్థిరంగా ఉంది. ఇది ఆర్థికవ్యవస్థ నిర్మాణాత్మక దృక్పథానికి కీలకం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనా 7.9 శాతంగా ఉంటుందని, ప్రస్తుత మార్చి త్రైమాసికానికి వాస్తవ జీడీపీ వృద్ధి 6.3 శాతంగా ఉంటుందని భావిస్తున్నామని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ-పట్టణ వినియోగం, ప్రైవేట్-పబ్లిక్ మూలధన వ్యయం మధ్య అంతరాలు తక్కువగా ఉంటాయని భావిస్తున్నట్టు నివేదిక తెలిపింది. గత నాలుగు త్రైమాసికాల్లో ప్రైవేట్ వినియోగం కోలుకోవడంతో 2024-25లో ఇది కరోనా మహమ్మారి ముందు స్థాయికి చేరుకుంటుంది. దేశీయంగా తయారీ రంగం మెరుగైన వృద్ధిని కొనసాగిస్తున్న కారణంగా వృద్ధి స్థిరంగా ఉంటుంది. రిటైల్ ద్రవ్యోల్బణం సైతం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతం ఉంటుందని ఆశిస్తున్నట్టు నివేదిక పేర్కొంది.


Next Story

Most Viewed