535 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

by Dishanational1 |
535 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మరోసారి ర్యాలీ కనిపించింది. అంతకుముందు సెషన్‌లో వరుస లాభాలకు బ్రేక్ పడినప్పటికీ, గురువారం ట్రేడింగ్‌లో సూచీలు పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుకు తోడు దేశీయ ప్రధాన రంగాల్లో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో కీలక బెంచ్‌మార్క్ సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త గరిష్టాల దిశగా కదిలాయి. ప్రధానంగా ఐటీ, ఆటో రంగాల షేర్ల కోసం ఇన్వెస్టర్లు ఉత్సాహపడ్డారు. యూరప్ ప్రాంతాల్లో పీఎంఐ డేటా, అమెరికా టెక్ షేర్లలో మెరుగైన ఆదాయ గణాంకాలతో గ్లోబల్ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. ఇదే సమయంలో భారత తయారీ రంగ ఉత్పత్తి గణాంకాలు మెరుగుపడుతుండటం, ఆర్థిక కార్యకలాపాల మద్దతుతో పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ పెరిగింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 535.15 పాయింట్లు ఎగసి 73,158 వద్ద, నిఫ్టీ 162.40 పాయింట్లు లాభపడి 22,217 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, ఐటీ, మీడియా, మెటల్ రంగాలు 1 శాతానికి పైగా బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, ఎంఅండ్ఎం, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎల్అండ్‌టీ, విప్రో కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.86 వద్ద ఉంది.


Next Story