మార్చిలో కొత్త రికార్డు జీఎస్టీ వసూళ్లు

by Dishanational1 |
మార్చిలో కొత్త రికార్డు జీఎస్టీ వసూళ్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మరోసారి రికార్డు స్థాయి జీఎస్టీ ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించి వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు రూ. 1.78 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2017, జూలైలో జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఇది రెండో అత్యధికం కావడం విశేషం. అలాగే, గతేడాది మార్చితో పోలిస్తే 11.5 శాతం అధికమని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. దేశీయ లావాదేవీలు 17.6 శాతం పెరగడం వల్లే మొత్తం జీఎస్టీ ఆదాయం భారీగా పెరిగింది. మెరుగైన ఆర్థిక కార్యకలాపాలను కూడా ఈ గణాంకాలు సూచిస్తున్నాయని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, సమీక్షించిన నెలలో మొత్తం రూ. 1,78,484 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదవగా, అందులో సీజీఎస్టీ రూ. 34,532 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ. 43,746 కోట్లు, ఐజీఎస్టీ రూ. 87,947 కోట్లు(దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేసిన రూ. 40,322 కోట్లతో కలిపి), సెస్ రూపంలో రూ. 12,259 కోట్లు(దిగుమతి వస్తువులపై వసూలైన రూ. 996 కోట్లతో కలిపి) వచ్చాయి.

పూర్తి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ ఆదాయం రూ. 20.14 లక్షల కోట్లు వచ్చాయి. ఇది అంతకుముందు కంటే 11.7 శాతం పెరిగంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సగటున నెలవారీ వసూళ్లు రూ. 1.68 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఇది సగటున రూ. 1.5 లక్షల కోట్లుగా నమోదైంది.

టాప్ 5 జీఎస్టీ వసూళ్లు..

2023, ఏప్రిల్ - రూ. 1.87 లక్షల కోట్లు

2024, మార్చి - రూ. 1.78 లక్షల కోట్లు

2024, జనవరి - రూ. 1.74 లక్షల కోట్లు

2023, అక్టోబర్ - రూ. 1.72 లక్షల కోట్లు

2024 ఫిబ్రవరి - రూ. 1.7 లక్షల కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో గత నెల రూ. 5,399 కోట్ల జీఎస్టీ ఆదాయం నమోదైంది. గతేడాది ఇదే నెలలో వచ్చిన రూ. 4,804 కోట్ల కంటే ఈసారి 12 శాతం పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ 16 శాతం వృద్ధితో రూ. 4,082 కోట్ల జీఎస్టీ రాబడి నమోదైంది.

Next Story

Most Viewed