2023 ద్వితీయార్థంలో మార్కెట్లోకి రానున్న ఎల్ఎంఎల్ తొలి ఎలక్ట్రిక్ వాహనం!

by Disha Web Desk 16 |
2023 ద్వితీయార్థంలో మార్కెట్లోకి రానున్న ఎల్ఎంఎల్ తొలి ఎలక్ట్రిక్ వాహనం!
X

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎల్ఎంఎల్ తిరిగి భారత మార్కెట్లోకి ప్రవేశించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ తన సొంత తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు కంపెనీ ఎండీ, సీఈఓ యోగేష్ భాటియా అన్నారు. ప్లాంటు ఏర్పాటుతో పాటు వ్యాపార విస్తరణ కోసం రూ. 500 కోట్ల వరకు నిధులను సమీకరించనుందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థం నాటికి కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయాలని లక్ష్యంగా ఉంది.

సొంత తయారీ ప్లాంటు కోసం కంపెనీ ఇప్పటికే సియేరా ఎలక్ట్రిక్ ఆటో కపెనీతో ఒప్పందం చేసుకుంది. సియేరా కంపెనీ అమెరికాకు చెందిన హార్లే డెవిడ్‌సన్‌కు చెందిన తయారీ ప్లాంటును కొనుగోలు చేసింది. ఈ ప్లాంటు నుంచే ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ కూడా తన మొదటిదశ వాహనాలను తయారు చేయాలని నిర్ణయించింది. మొదటిదశలో కంపెనీ మూడు ఈవీలను తీసుకురానుంది.

ఇందులో మొదటి ఉత్పత్తి ఈవీ సైకిల్, దీని తర్వాత హపర్ బైక్, అనంతరం ఎలక్ట్రిక్ స్కూటర్ 2023 ద్వితీయార్థంలో అందుబాటులోకి వస్తాయని యోగేష్ భాటియా అన్నారు. ఓవైపు సియేరా కంపెనీతో ఒప్పందం చేసుకున్నప్పటికీ, ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ తన సొంత తయారీ ప్లాంటు కోసం ప్రయత్నాలు చేస్తోంది. రాబోయే రెండేళ్లలో సొంత ప్లాంటును ప్రారంభిస్తామని యోగేష్ తెలిపారు. తద్వారా 2025 కల్లా ఏడాదికి 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేస్తామని, రాబోయే నాలుగైదేళ్లలో ప్రతి జిల్లాలోను తమ డీలర్‌షిప్‌లు ఉంటాయని ఆయన వెల్లడించారు.


Next Story

Most Viewed