అదానీ గ్రూప్ షేర్లలో ఆవిరవుతున్న ఎల్ఐసీ పెట్టుబడులు!

by Disha Web Desk 17 |
అదానీ గ్రూప్ షేర్లలో ఆవిరవుతున్న ఎల్ఐసీ పెట్టుబడులు!
X

ముంబై: హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావంతో కుదేలైన అదానీ గ్రూప్ ఇప్పట్లో కోలుకునే సూచనలు కనిపించడం లేదు. ఈ క్రమంలో అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు ఫండ్ సంస్థలు సైతం దీనిపై ఆందోళన చెందుతున్నాయి. అందులో ప్రధానంగా ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ పెట్టుబడుల గురించి అందరికీ ఆందోళనగా మారింది. అదానీ కంపెనీల షేర్లు సగానికి పైగా క్షీణించడంతో వాటిలో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ కూడా అంతే స్థాయిలో పడిపోతోంది.

ఈ నెల ప్రారంభంలో అదానీ షేర్లు దెబ్బతిన్నప్పటికీ తాము లాభాల్లోనే ఉన్నామని ఎల్ఐసీ ప్రకటించింది. తాజా గణాంకాల ప్రకారం ఈ మొత్తం కూడా గణనీయంగా దెబ్బతిన్నదని తెలుస్తోంది. అదానీ గ్రూప్ షేర్లలో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ మొత్తం రూ. 30,127 కోట్లు కాగా, శుక్రవారం నాటికి వాటి విలువ రూ. 33,686 కోట్లుగా ఉందని ఓ నివేదిక తెలిపింది.

జనవరి 30న అదానీ షేర్లలో రూ. 26 వేల కోట్ల లాభాల్లో ఉన్నామని ఎల్ఐసీ వెల్లడించింది. అంతకుముందు డిసెంబర్ సమయంలో ఈ లాభాలు దాదాపు రూ. 50 వేల కోట్ల వరకు ఉండగా, ఇప్పుడవన్నీ ఆవిరయ్యాయి. ఇప్పుడు ఎల్ఐసీ సంస్థ కేవలం రూ. 3 వేల కోట్ల లాభాల్లో ఉండటం గమనార్హం.

ఎల్ఐసీ అదానీ గ్రూపునకు చెందిన అదానీ గ్రీన్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అంబుజా, ఏసీసీ సిమెంట్ షేర్లలో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ షేర్లలో పతనం కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్ఐసీ లాభాలు మరింత పడిపోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నష్టాలు రాకుండా అదానీ షేర్లను అమ్మడానికి ఎల్ఐసీ ప్రయత్నిస్తే అదానీ గ్రూప్‌పై అధిక ఒత్తిడి ఉండవచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story

Most Viewed