ఎనిమిది రకాల స్టీల్ తయారీకి రూ. 7,930 కోట్ల పెట్టుబడి: Jindal Steel !

by Disha Web Desk 17 |
ఎనిమిది రకాల స్టీల్ తయారీకి రూ. 7,930 కోట్ల పెట్టుబడి: Jindal Steel !
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పీఎల్ఐ పథకానికి ఎంపికైన నేపథ్యంలో దేశీయ ఉక్కు తయారీ కంపెనీ జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్(జేఎస్‌పీఎల్) అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన ఎనిమిది రకాల ఉక్కు తయారీ కోసం రూ. 7,930 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కంపెనీ ఎండీ విమలేంద్ర ఝా అన్నారు. హెచ్ఆర్ కాయిల్, ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమలో వినియోగించే ఏపీఐ జీఆర్ ప్లేట్లు, షీట్స్‌ను పీఎల్ఐ పథకం కింద ఉత్పత్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

అలాగే, నిర్మాణాలు, వాహనాల పరిశ్రమలో అవసరమైన పటిష్ఠమైన షీట్లు తయారు చేయనున్నట్లు తెలిపారు. కేంద్రం ఇటీవల దేశీయ ఉక్కు రంగంలో కొత్త టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి విలువైన ఉక్కు ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం అమలు చేసింది. ఈ పథకం కింద రూ. 42,500 కోట్ల పెట్టుబడి సామర్థ్యంతో మొత్తం 67 కంపెనీలను ఎంపిక చేయగా, ఇవి 70 వేల ఉద్యోగాలకు ఊతమివ్వనున్నాయి.

అదేవిధంగా 2.6 కోట్ల టన్నుల స్పెషాలిటీ స్టీల్ తయారీ సామర్థ్యాన్ని కంపెనీలు అందిపుచ్చుకోనున్నాయి. ఈ పథకం కింద ఎంపికైన జేఎస్‌పీఎల్ ఎనిమిది రకాల స్పెషాలిటీ స్టీల్‌ని తయారు చేయనుంది. ఈ పథకం కింద ఎంపికైన ఇతర కంపెనీల్లో టాటా స్టీల్ ఏడు రకాలు, జేస్‌డబ్ల్యూ స్టీల్ ఆరు రకాలు, ఆర్సెలార్ మిత్తల్ నాలుగు రకాలు, ప్రభుత్వ రంగ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా రెండు రకాల స్పెషాలిటీ స్టీల్‌ను తయారు చేస్తాయి.

కాగా, దేశీయంగా స్పెషాలిటీ స్టీల్ తయారీ కోసం కేంద్రం గతేడాది రూ. 6,332 కోట్ల పీఎల్ఐ పథకానికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed