20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ విక్రయిస్తున్న జియో-బీపీ!

by Disha Web Desk 17 |
20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ విక్రయిస్తున్న జియో-బీపీ!
X

న్యూఢిల్లీ: రిలయన్స్, బీపీ సంస్థల సంయుక్త సంస్థ జియో-బీపీ ఇకపై పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపిన చమురును విక్రయించనున్నట్టు గురువారం ప్రకటించింది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా 20 శాతం ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్‌ను విక్రయించే మొట్టమొదటి సంస్థగా తాము నిలిచామని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన జియో-బీపీ పెట్రోల్ బంకుల వద్ద ఈ20 పెట్రోల్ లభిస్తుందని, త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్టు తెలిపింది.

ముడి చమురు, కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా కేంద్రం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలని సూచించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం, కంపెనీలు 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ ద్వారా రూపొందించిన ఈ20 రకం ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. జియో-జీపీ జాయింట్ వెంచర్‌గా ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా 1,510 పెట్రోల్ బంకులను నిర్వహిస్తోంది.

ఇథనాల్‌ను బియ్యం నూకలు, చెరకు, ఇతర ఆహార ధాన్యాల నుంచి తయారు చేస్తారు. దేశంలో అత్యధికంగా వినియోగిస్తున్న చమురు దిగుమతులను తగ్గించడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించేందుకు అవసరమైన కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు ఇథనాల్‌ను కలిపే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. దీనివల్ల రైతుల ఆదాయం పెరగడానికి కూడా దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Next Story