మహిళా సమ్మాన్ సర్టిఫికేట్ పథకంపై వచ్చే వడ్డీకి టీడీఎస్ మినహాయింపు!

by Disha Web Desk 17 |
మహిళా సమ్మాన్ సర్టిఫికేట్ పథకంపై వచ్చే వడ్డీకి టీడీఎస్ మినహాయింపు!
X

న్యూఢిల్లీ: మహిళల కోసం కేంద్రం తెచ్చిన ప్రత్యేక మహిళా సమ్మాన్ సర్టిఫికేట్(ఎంఎస్ఎస్‌సీ) పథకం కింద వచ్చే వడ్డీకి మూలం వద్ద పన్ను (టీడీఎస్) వర్తించదని ప్రభుత్వం తెలిపింది. అయితే, ఎంఎస్ఎస్‌సీ పథకంపై వచ్చిన వడ్డీ ఆదాయంపై ఖాతాదారుకు వర్తించే శ్లాబ్ ఆధారంగా పన్ను అమలవుతుందని వెల్లడించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) మే 16 నాటి నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

ఎంఎస్ఎస్‌సీపై ఆర్జించే వడ్డీపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 40 వేలు మించకపోతే టీడీఎస్ వర్తించదని సీబీడీటీ పేర్కొందని నంగియా ఆండర్సన్ ఇండియా పార్ట్‌నర్ నీరజ్ అగర్వాలా అన్నారు. ప్రస్తుత(2023-24) ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల కోసం ఎంఎస్ఎస్‌సీ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే మహిళలకు ఏడాదికి 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఇందులో డిపాజిట్ గరిష్ట పరిమితి రూ. 2 లక్షలు నిర్ణయించగా, రెండేళ్లు పూర్తయిన తర్వాత డిపాజిట్ మొత్తం మెచ్యూర్ అవుతుంది.


Next Story

Most Viewed