వరుస నష్టాల నుంచి లాభాల్లోకి మారిన సూచీలు!

by Disha Web Desk 17 |
వరుస నష్టాల నుంచి లాభాల్లోకి మారిన సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాల నుంచి బయటపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు ముడి చమురు ధరలు క్షీణించడం, వరుస మూడు రోజుల నష్టాల నేపథ్యంలో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం వంటి పరిణామాలు సూచీలకు కలిసొచ్చాయి.

మంగళవారం ఉదయం ట్రేడింగ్ మొదలైన సమయంలో కొంత ఊగిసలాట కనిపించినప్పటికీ ఆ తర్వాత కోలుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లు రికవరీ ధోరణిలో ర్యాలీ చేయడంతో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ఉత్సాహం కనబడిందని విశ్లేషకులు తెలిపారు. రోజంతా స్థిరంగా కదలాడిన సూచీలు చివరి గంటలో పెద్ద ఎత్తున కొనుగోళ్ల మద్దతుతో గరిష్ఠాలకు చేరాయి.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 274.12 పాయింట్లు ఎగసి 61,418 వద్ద, నిఫ్టీ 84.25 పాయింట్లు లాభపడి 18,244 వద్ద ముగిశాయి. నిఫ్టీలో రియల్టీ మాత్రమే బలహీనపడగా, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, ఐటీ రంగాలు పుంజుకున్నాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, అల్ట్రా సిమెంట్, టైటాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి. నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఈఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ స్టాక్స్ మాత్రమే నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 81.64 వద్ద ఉంది.


Next Story