2030 నాటికి ట్రిలియన్ డాలర్లకు ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ!

by Disha Web Desk 17 |
2030 నాటికి ట్రిలియన్ డాలర్లకు ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ!
X

న్యూఢిల్లీ: భారత ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ ఆరు రెట్ల వృద్ధితో 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల(రూ. 82.62 లక్షల కోట్ల)కు చేరుకుంటుందని గూగుల్, టెమాసెక్, బైన్ అండ్ కంపెనీ సంయుక్త నివేదిక మంగళవారం ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా ఈ-కామర్స్ రంగం మద్దతుతో ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందని నివేదిక అభిప్రాయపడింది.

2022 నాటికి దేశ ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ 155-175 బిలియన్ డాలర్లు(రూ. 13-15 లక్షల కోట్లు)గా ఉంది. ఇంటర్నెట్ వృద్ధి హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్,పెరిగిన ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ కంటెంట్ వినియోగం ద్వారా వేగ‌వంతం అయ్యేందుకు అవకాశం ఉందని నివేదిక అంచనా వేస్తున్నట్టు గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్, వైస్-ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా అన్నారు.

భవిష్యత్తులో దేశవ్యాప్తంగా చాలావరకు కొనుగోళ్లు డిజిటల్‌గానే జరుగుతాయి. స్టార్టప్‌లు డిజిటల్ వినియోగాన్ని మరింత పెంచనున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, పెద్ద సంస్థలు పోటీ పడి మరీ డిజిటల్ టెక్నాలజీని వినియోగించడం ప్రారంభించాయని సంజయ్ గుప్తా తెలిపారు.

నివేదిక ప్రకారం, 2022 నాటికి రిటైల్ ఈ-కామర్స్ వ్యాపారం రూ. 5.37 లక్షల కోట్ల నుంచి 2030 నాటికి రూ. 31.4 లక్షల కోట్లతో 5-6 రెట్లు పెరగనుంది. బీ2బీ ఈ-కామర్స్ 14 రెట్ల వృద్ధితో రూ. 8.7 లక్షల కోట్లకు, సాఫ్ట్‌వేర్ సేవల విభాగం 5-6 రెట్లు పెరిగి రూ. 5.37 లక్షల కోట్లకు చేరుకుంటాయని పేర్కొంది.

Next Story

Most Viewed