రికార్డు కనిష్టానికి ఒపెక్ ముడి చమురు దిగుమతి!

by Dishafeatures2 |
రికార్డు కనిష్టానికి ఒపెక్ ముడి చమురు దిగుమతి!
X

న్యూఢిల్లీ: రష్యా చమురు చవకగా లభిస్తున్న తరుణంలో భారత్ ముడి చమురు దిగుమతుల్లో ఒపెక్ దేశాల వాటా రికార్డు స్థాయిలో తగ్గిపోతోంది. ఎనర్జీ కార్గొ ట్రాకర్ వొర్టెక్సా తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం దిగుమతుల్లో ఒపెక్ దేశాల వాటా 46 శాతానికి పడిపోయింది. చమురును ఎగుమతి చేసే దేశాల సమాఖ్యను ఒపెక్‌గా చెబుతారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. చమురు దిగుమతి దేశంగా ఉన్న భారత్ ఎప్పటినుంచో ఆయా దేశాల నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తోంది. 2022 ఏప్రిల్ సమయంలో భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో 72 శాతంగా ఉన్న ఒపెక్ దేశాల వాటా.. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 46 శాతానికి పడిపోవడం విశేషం.

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధమే దీనికి కారణం. యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో ఆదాయం కోసం తక్కువ ధరకే ముడి చమురు విక్రయించేందుకు రష్యా సిద్ధమైంది. దీన్ని భారత్, చైనా దేశాలు సద్వినియోగం చేసుకునే క్రమంలో పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. క్రమంగా దిగుమతి పరిణామాన్ని పెంచిన భారత్ ఏప్రిల్‌లో సగటున 46 లక్షల బ్యారెళ్ల ముడి చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఒకప్పుడు భారత ముడి చమురు దిగుమతుల్లో 1 శాతం వాటా కలిగిన రష్యా ఇప్పుడు అతిపెద్ద భాగస్వామిగా నిలిచింది.

Next Story

Most Viewed