ఫిబ్రవరిలో రూ. 1.68 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం

by Dishanational1 |
ఫిబ్రవరిలో రూ. 1.68 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మరోసారి భారీ జీఎస్టీ ఆదాయం వచ్చింది. ఫిబ్రవరిలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇది గతేడాది వసూలైన దాని కంటే 12.5 శాతం అధికమని ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. మెరుగైన ఆర్థిక కార్యకలాపాలను ఈ గణాంకాలు సూచిస్తున్నాయని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. జనవరి నెలతో పోలిస్తే వసూళ్లు కొంత తక్కువ ఉన్నప్పటికీ, ఫిబ్రవరిలో తక్కువ రోజులు ఉండటం దీనికి కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు స్థూలంగా రూ. 18.40 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 11.7 శాతం అధికమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. అలాగే 2023-24లో సగటున నెలకు రూ. 1.67 లక్షల కోట్లు వచ్చాయి, ఇది 2022-23లో నమోదైన సగటు రూ. 1.5 లక్షల కంటే ఎక్కువ. మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, సమీక్షించిన నెలలో మొత్తం రూ. 1,68,337 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదవగా, అందులో సీజీఎస్టీ రూ. 31,785 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ. 39,615 కోట్లు, ఐజీఎస్టీ రూ. 84,098 కోట్లు(దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేసిన రూ. 38,593 కోట్లతో కలిపి), సెస్ రూపంలో రూ. 12,839 కోట్లు(దిగుమతి వస్తువులపై వసూలైన రూ. 984 కోట్లతో కలిపి) వచ్చాయి. దేశీయ లావాదేవీలపై జీఎస్టీ వసూళ్లు 13.9 శాతం, దిగుమతి వస్తువులపై జీఎస్టీ 8.5 శాతం పెరగడం వల్ల మొత్తం జీఎస్టీ ఆదాయ వృద్ధికి దోహదం చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

తెలంగాణలో 18 శాతం వృద్ధి..

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో గత నెల రూ. 5,211 కోట్ల జీఎస్టీ ఆదాయం నమోదైంది. గతేడాది ఇదే నెలలో వచ్చిన రూ. 4,424 కోట్ల కంటే ఈసారి 18 శాతం పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ 3 శాతం వృద్ధితో రూ. 3,678 కోట్ల జీఎస్టీ రాబడి నమోదైంది.


Next Story