ఫిబ్రవరిలో 6 శాతం పెరిగిన ఇంధన వినియోగం

by Dishanational1 |
ఫిబ్రవరిలో 6 శాతం పెరిగిన ఇంధన వినియోగం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఇంధన వినియోగం పెరిగింది. వార్షిక ప్రాతిపదికన ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.7 శాతం వృద్ధి నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు గురువారం వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీ కార్యకలాపాలు పెరగడమే ఇందుకు కారణమని చమురు మంత్రిత్వ శాఖలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్(పీపీఏసీ) డేటా పేర్కొంది. సమీక్షించిన నెలలో మొత్తం ఇంధన వినియోగం 1.97 కోట్ల మెట్రిక్ టన్నులు(రోజు 49.8 లక్షల బ్యారెల్స్)కు చేరింది. గతేడాది ఇదే నెలలో దేశీయంగా 1.86 కోట్ల మెట్రిక్ టన్నుల ఇంధనం వాడినట్టు పీపీఏసీ డేటా వివరించింది. రోజువారీగా కూడా జనవరిలో నమోదైన 47.4 లక్షల బ్యారెళ్ల కంటే గత నెల 5.1 శాతం పెరిగింది. గడిచిన కొద్ది నెలల నుంచి దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి కారణంగా పెరుగుతున్న డిమాండ్‌ను ఇంధన వినియోగం సూచిస్తుందని కెప్లర్‌కు చెందిన విశ్లేషకులు విక్టర్ కటొనా చెప్పారు. ఇదే సమయంలో డీజిల్ వినియోగం చరిత్రలో మొదటిసారిగా రోజుకు 20 లక్షల బ్యారెళ్లను అధిగమించింది. ఇది రాబోయే జూన్ నెలలో కొత్త రికార్డులను చేరవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా ట్రక్కులు, కమర్షియల్ వాహనాల్లో డీజిల్ వాడకం ఎక్కువ కావున అమ్మకాలు ఫిబ్రవరిలో 6.2 శాతం 74.4 లక్షల టన్నులకు చేరాయి. పెట్రోల్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 8.9 శాతం పెరిగి 30.2 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. వంటగ్యాస్ అమ్మకాలు 8.5 శాతం పెరిగి 25.9 లక్షల టన్నులకు చేరాయని గణాంకాలు వెల్లడించాయి.


Next Story

Most Viewed