చైనాకు మూడో వంతు క్షీణించిన భారత ఎగుమతులు!

by Disha Web Desk 16 |
చైనాకు మూడో వంతు క్షీణించిన భారత ఎగుమతులు!
X

న్యూఢిల్లీ: చైనాలో ఆర్థిక కార్యలాపాలు దెబ్బతినడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై మధ్య డ్రాగన్ దేశానికి భారత ఎగుమతులు 33.4 శాతం క్షీణించాయని గణాంకాలు వెల్లడించాయి. ఇదే సమయంలో భారత్ మొత్తం ఎగుమతులు 20.1 శాతం పెరగడం గమనార్హం. సమీక్షించిన కాలంలో భారత్ నుంచి చైనా మొత్తం రూ. 47 వేల కోట్ల(5.9 బిలియన్ డాలర్ల)తో నాలుగో అతిపెద్ద ఎగుమతి కేంద్రంగా ఉంది. గతేడాది ఇదే సమయంలో రెండో స్థానం నుంచి దిగజారింది. ఇటీవల పరిణామాల్లో చైనా ఆర్థికవ్యవస్థ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిని, వినియోగం భారీగా క్షీణించడంతో ఎగుమతుల డిమాండ్ పడిపోయింది.

సమీక్షించిన కాలంలో పెరిగిన ముడి చమురు ధరల కారణంగా పెట్రోలియం ఉత్పత్తులైన నాఫ్తా ఎగుమతులు 81 శాతం పెరిగి రూ. 9,500 కోట్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో ఆర్గానిక్ కెమికల్స్ 38.3 శాతం, ఇనుప ఖనిజం 78.5 శాతం, అల్యూమినియం ఉత్పత్తులు 84.2 శాతం క్షీణించాయి. అయితే, బాస్మతీయేతర బియ్యం 141.1 శాతం, సముద్ర ఉత్పత్తులు 18.7 శాతం పెరిగాయి. చైనాలో ఉక్కు ఉత్పత్తిలో కోత విధించడం కూడా భారత ఇనుప ఖనిజం ఎగుమతులు గణనీయంగా తగ్గేందుకు దారితీసింది. కాగా, ఏప్రిల్-జూలై మధ్య భారత మొత్తం దిగుమతులు 48.1 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. ఇందులో చైనా నుంచి దిగుమతులు 24.7 శాతం పెరిగాయి. దీంతో 2022-23 మొదటి నాలుగు నెలల్లో భారత వాణిజ్య లోటు రూ. 2.27 లక్షల కోట్ల(28.6 బిలియన్ డాలర్ల)కు కారణమయ్యాయి.

Next Story

Most Viewed