టెస్లా కోసం భారత్‌లో నిబంధనలు మారవు: పీయూష్ గోయల్

by Dishanational1 |
టెస్లా కోసం భారత్‌లో నిబంధనలు మారవు: పీయూష్ గోయల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో అమెరికాకు చెందిన ఈవీ కార్ల తయారీ కంపెనీ టెస్లాకు అనుగుణంగా నిబంధనలు మారవని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో ప్లాంట్ల ఏర్పాటు చేసేందుకు గ్లోబల్ ఈవీ బ్రాండ్ల కోసం చట్టాలు, సుంకాలను రూపొందించామని మంత్రి పేర్కొన్నారు. కొన్నేళ్ల నుంచి భారత మార్కెట్లో ప్రవేశించేందుకు టెస్లా కంపెనీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం భారత ప్రభుత్వం దిగుమతి పన్నులను తగ్గించాలని కోరుతోంది. కానీ, వేరే కంపెనీలకు ఇవ్వని ప్రాధాన్యం టెస్లాకు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే దీనిపై సమాధానం ఇచ్చినప్పటికీ, తాజాగా మరోసారి పీయుష్ గోయల్ స్పష్టత ఇచ్చారు.

ఆదివారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ఈవీలతో ఉన్న ప్రయోజనాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని చట్టాలను రూపొందించింది. బ్యాటరీతో నడిచే వాహనాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కర్బన ఉద్గారాలను తగ్గించడంతోపాటు చమురు దిగుమతుల బిల్లు కూడా తగ్గుతుంది. అయితే, దీనికోసం ఒక కంపెనీకే మేలు చేసేలా నిబంధనలను మార్చలేం. యూరప్, అమెరికా సహా ఇతర దేశాలకు చెందిన కంపెనీలతో చర్చలు నిర్వహిస్తున్నాం. భారత్‌లో పెట్టుబడి కోసం తమ డిమాండ్లను కోరవచ్చు. వాటిని ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుందని భావించవద్దు. భవిష్యత్తులో అతిపెద్ద ఈవీ తయారీ కేంద్రంగా భారత్ మారనుంది. ఇది ఆర్థికవ్యవస్థకు మరింత శక్తిని ఇస్తుందని ' మంత్రి వివరించారు. కాగా, ప్రస్తుతానికి దిగుమతి వాహనాలపై 40 వేల డాలర్లు, అంతకంటే ఎక్కువ ఉంటే 60 శాతం దిగుమతి పన్ను అమలవుతోంది. 40 వేల డాలర్ల(సుమారు రూ. 30 లక్షలు) కంటే ఎక్కువ ఖరీదైన వాహనాల దిగుమతులపై 100 శాతం పన్ను ఉంది. దీన్ని 70 శాతానికి తగ్గించాలని టెస్లా కోరుతోంది. ఆ తర్వాత ప్రజల ఆదరణను బట్టి ప్లాంటు ఏర్పాటు చేస్తామని చెబుతోంది.


Next Story