Aviation: ఉద్రిక్తతలు తొలగడంతో 32 విమానాశ్రయాల రీఓపెన్‌కు ఏఏఐ ఉత్తర్వులు

by S Gopi |

ఈ విమానాశ్రయాలు తక్షణం పౌర సేవల కోసం కార్యకలాపాలను ప్రారంభించాయి.

Aviation: ఉద్రిక్తతలు తొలగడంతో 32 విమానాశ్రయాల రీఓపెన్‌కు ఏఏఐ ఉత్తర్వులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో 32 విమానాశ్రయాలను మూసేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణను ప్రకటించడంతో ఈ ఎయిర్‌పోర్టులను సోమవారం ఉదయం నుంచి తిరిగి ప్రారంభించినట్టు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) విమానాశ్రయ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ విమానాశ్రయాలు తక్షణం పౌర సేవల కోసం కార్యకలాపాలను ప్రారంభించాయి. ఫ్లైట్ స్టేటస్ గురించి నేరుగా విమానయాన సంస్థల నుంచి తెలుసుకోవాలని, సాధారణ అప్‌డేట్‌ల గురించి వాటి వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవాలని ఏఏఐ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతకుముందు అధికారికంగా ఈ నెల 15 వరకు విమానాశ్రయాల మూసివేతను కొనసాగించాలని భావించినప్పటికీ, పరిస్థితులు సాధారణంగా ఉండటంతో కార్యకలాపాలను నిర్వహించేందుకు అధికారులు అనుమతించారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన మే 7న అంబాలా, అమృత్సర్, భుజ్, బికనీర్, చండీగఢ్, హిండన్, జైసల్మేర్, జమ్మూ, జామ్‌నగర్, జోధ్‌పూర్, లేహ్, లూధియానా, ముంద్రా, పోర్బందర్, రాజ్‌కోట్, సిమ్లా, శ్రీనగర్ వంటి ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాలు మూతబడ్డాయి. దీనివల్ల విమానయాన సంస్థలు వందలాది విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.

Next Story