Economy: వికసిత్ భారత్ కావాలంటే 8-9 శాతం వృద్ధి అవసరం: రఘురామ్ రాజన్

by S Gopi |

ఈ గణాంకాలు అనేక దేశాల ఆర్థికవ్యవస్థల కంటే చాలా ఎక్కువ.

Economy: వికసిత్ భారత్ కావాలంటే 8-9 శాతం వృద్ధి అవసరం: రఘురామ్ రాజన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: 2047 నాటికి భారత్ వికసిత దేశంగా మారాలనుకుంటే, 8, 8.5 నుంచి 9 శాతం వృద్ధి అవసరమని ఆర్‌బీఐ మాజీ గవర్నర్, ఆర్థికవేత రఘురామ్ రాజన్ తెలిపారు. అందుకు కారణంగా మనది ఇప్పటికీ పేద దేశమేనని అన్నారు. మంగళవారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. అనేక అంశాల కారణంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ అనిశ్చితిని ఎదుర్కొంటోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ బలమైన జీడీపీ గణాంకాలను నమోదు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో భారత జీడీపీ 7.4 శాతంగా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 6.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ గణాంకాలు అనేక దేశాల ఆర్థికవ్యవస్థల కంటే చాలా ఎక్కువ. ప్రస్తుత ఈ వృద్ధి చాలా ముఖ్యమైనదే, కానీ ఎన్నికల వల్ల ప్రభుత్వ వ్యయానికి అవాంతరాలు ఎదురవడం, ఇతర గణాంకాల్లో ఒడిదుడుకులు ఉండటం వల్ల ఇది సరిపోదు. ఇంకా చాలా సాధించాల్సి ఉంది. పెట్టుబడులు వచ్చేందుకు మరిన్ని చర్యలు, వినియోగం పెంచే నిర్ణయాలు, దేశీయ-విదేశీ వ్యాపారాలు భారత్‌వైపు చూసే ధోరణిని కొనసాగించే ప్రయత్నాలు, అధిక వృద్ధిని కొనసాగించే వ్యూహం అవసరమని ఆయన వెల్లడించారు.

జపాన్‌ను అధిగమించడంతో అయిపోలేదు

భారత జీడీపీ జపాన్‌ను దాటి నాల్గవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించడంపై స్పందించిన రఘురామ్ రాజన్, ఈ మైలురాయిని అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. కానీ మరింత స్థిరమైన లక్ష్యాలు ఏర్పరచుకోవాలని అన్నారు. ఇతర దేశాలను దాటి అతిపెద్ద జీడీపీ దేశంగా మారుతుండం గర్వంగా ఉంది, రాబోయే సంవత్సరాలలో జర్మనీని కూడా దాటగలం. బహుశా మరో 1-2 ఏళ్లలో ఇది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఇదే సమయంలో జీడీపీ ర్యాంకింగ్‌లను నిజమైన ఆర్థిక పురోగతిగా భావించవద్దని ఆయన హెచ్చరించారు. మారకపు రేటు ఈ హెచ్చుతగ్గులను ప్రభావితం చేస్తాయి. జపనీస్ యెన్ బలంగా ఉంది. ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. మనం ఈ దేశాల కంటే చాలా పేదవాళ్ళం. సగటు పౌరుడికి మనం ఎంత ధనవంతులు అనేది ముఖ్యం, జీడీపీ గణాంకాల హెచ్చుతగ్గులు కాదు. ఎందుకంటే మనం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. కాబట్టి సామాన్య పౌరుడు పేదవాడిగా ఉన్నా సరే, మొత్తం జీడీపీ ఎక్కువగా ఉంటుంది.

Next Story