India: ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్

by S Gopi |

భారత్ మొత్తం 150.18 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేయగా, చైనా 145.28 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసిందని తెలిపారు.

India: ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ తొలిసారిగా చైనాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా అవతరించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ప్రకటించారు. భారత్ మొత్తం 150.18 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేయగా, చైనా 145.28 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసిందని తెలిపారు. ఇది ఒక గొప్ప విజయం, భారతీయ వ్యవసాయం ఎంతగా అభివృద్ధి చెందిందో అన్నదానికి రుజువని ఆయన అన్నారు. దేశంలో ఇప్పుడు తగినంత ఆహార ధాన్యాలు ఉన్నాయని, ఇతర దేశాలకు బియ్యాన్ని కూడా ఎగుమతి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి 25 విభిన్న పంటలకు చెందిన 184 కొత్త, మెరుగైన విత్తన రకాలను విడుదల చేశారు. ఈ విత్తనాలు అధిక దిగుబడిని, మెరుగైన నాణ్యత గల పంటలను అందించి, రైతులు ఎక్కువ డబ్బు సంపాదించడానికి సహాయపడతాయి. రాబోయే సీజన్లలో రైతులు వీటి నుంచి ప్రయోజనం పొందేలా, ఈ విత్తనాలు త్వరగా వారికి చేరేలా చూడాలని అధికారులను కోరారు. ఆహార కొరత ఉన్న దేశం నుంచి ఆహార మిగులు దేశంగా భారత్ అవతరించిందని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.

1969 నుంచి భారత్‌లో 7,200 కంటే ఎక్కువ పంట రకాలు అభివృద్ధి అయ్యాయి, ప్రస్తుత ప్రభుత్వం హయాంలో దాదాపు 3,236 అధిక దిగుబడినిచ్చే రకాలు ఆమోదించినట్టు వెల్లడించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు, విత్తన కంపెనీల కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ కొత్త విత్తనాలు కరువు, నాసిరకం నేల, తెగుళ్లు, వ్యాధులు వంటి వాతావరణ మార్పుల సమస్యలను తట్టుకునేలా రూపొందాయి. వీటిలో వరి, గోధుమలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, పత్తి, చెరకు, పశుగ్రాస పంటలు ఉన్నాయి. భారత్ ఆహారానికి సంబంధించి పూర్తిగా స్వావలంబన సాధించేందుకు పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిని పెంచడంపై కూడా దృష్టి సారిస్తోందన్నారు.

Next Story