దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు సిద్ధమవుతున్న హ్యూండాయ్ ఇండియా

by Dishanational1 |
దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు సిద్ధమవుతున్న హ్యూండాయ్ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దక్షిణ కొరియాకు చెందిన హ్యూండాయ్ మోటార్ కంపెనీ భారత విభాగం ఐపీఓకు సిద్ధమవుతోంది. దేశీయ వాహన రంగంలో దిగ్గజ బ్రాండ్‌గా ఉన్న హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)ను తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా నవంబర్ మధ్య దీపావళి పండుగ సమయంలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది. బ్యాంకర్లు హెచ్ఎంఐఎల్ విలువ 22-28 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 1.82-2.32 లక్షల కోటు)గా నిర్ణయించారని, ఇందులో సుమారు రూ. 27,390-46,480 కోట్ల వరకు నిధులను సమీకరించనున్నట్టు సమాచారం. ఇది ఇప్పటివరకు అతిపెద్ద ఐపీఓ అయిన ఎల్ఐసీ రూ. 21 వేల కోట్ల కంటే చాలా పెద్దది. గతవారమే గోల్డ్‌మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ, హెచ్ఎస్‌బీసీ వంటి గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు గతవారం సియోల్‌లో హ్యూండాయ్‌ ఐపీఓ ప్రక్రియను తయారు చేశాయి.

భారత మార్కెట్లోకి 1996లో అడుగుపెట్టిన హ్యూండాయ్, మారుతీ సుజుకి తర్వాత రెండవ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ బ్రాండుగా ఉంది. ప్రస్తుతం మారుతీ సుజుకి మార్కెట్ విలువ రూ. 3.31 లక్షల కోట్లు ఉండగా, దీని తర్వాత టాటా మోటార్స్ విలువ రూ. 3.43 లక్షల కోట్లుగా ఉంది. ఎగువ బ్యాండ్ వద్ద హ్యూండాయ్ ఇండియా విలువ రూ. 1.8 లక్షల కోట్లుగా ఉంది. హ్యూండాయ్ ఐపీఓ ప్రక్రియ ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత వేగవంతమవుతుందని ఎకనమిక్ టైమ్స్ నివేదిక అంచనా వేసింది. గత నెలలో మహరాష్ట్రలోని జనరల్ మోటార్స్ ఇండియాకు చెందిన తాలెగావ్ ప్లాంటును కొనుగోలు చేశామని, కొత్తగా రూ. 6,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు హెచ్ఎంఐఎల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కంపెనీ 2025 నాటికి ఈ ప్లాంటులో 1.30 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధిస్తామని పేర్కొంది.



Next Story

Most Viewed