హైదరాబాద్‌లో 38 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు

by Dishanational1 |
హైదరాబాద్‌లో 38 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఇళ్ల అమ్మకాలు 14 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రధాన ఏడు నగరాల్లో జనవరి-మార్చి మధ్య మొత్తం 1,30,170 యూనిట్ల ఇళ్లు అమ్ముడవగా, గతేడాది ఇదే సమయంలో 1,13,775 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ బుధవారం ప్రకటనలో తెలిపింది. ఇదే త్రైమాసికంలో ప్రధాన నగరాల్లో సగటున ఇళ్ల ధరలు 10-32 శాతం పెరిగాయి. ముంబై మెట్రో, బెంగళూరు, హైదరాబాద్, పూణె నగరాల్లో ప్రాపర్టీ అమ్మకాలు పెరగ్గా, ఢిల్లీ-ఎన్‌సీఆర్, చెన్నై, కోల్‌కతా నగరాల్లో క్షీణించాయి. అనరాక్ నివేదిక ప్రకారం, రూ. 1.5 కోట్లు, అంతకంటే ఎక్కువ ఖరీదైన ఇళ్లకు అత్యధిక డిమాండ్ పెరగడంతో గత దశాబ్దంలోనే ఎక్కువగా అమ్మకాలు ఈ త్రైమాసికంలో నమోదయ్యాయని అనరాక్ ఛైర్మన్ అనుజ్ పూరి అన్నారు. ముంబై మెట్రోలో ఇళ్ల అమ్మకాలు 24 శాతం పెరిగి 42,920 యూనిట్లు అమ్ముడవగా, పూణెలో 15 శాతం పెరిగి 22,990 యూనిట్లు, హైదరాబాద్‌లో 38 శాతం వృద్ధితో 19,660 యూనిట్లు, బెంగళూరులో 14 శాతం అధికంగా 17,790 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో విక్రయాలు 9 శాతం క్షీణించి 15,650 యూనిట్లు, కోల్‌కతాలో 9 శాతం తగ్గి 5,650 యూనిట్లు, చెన్నైలో 6 శాతం తక్కువగా 5,510 యూనిట్ల విక్రయాలు జరిగాయి.


Next Story