తొలిసారి రూ. 2 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

by Dishanational1 |
తొలిసారి రూ. 2 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్ల చరిత్రలోనే రికార్డు స్థాయి రాబడి నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలకు సంబంధించి జీఎస్టీ ఆదాయం కీలక మైలురాయిని తాకింది. గతేడాదితో పోలిస్తే 12.4 శాతం అధికంగా రూ. 2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.78 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇప్పటివరకు 2023, ఏప్రిల్‌లో వచ్చిన రూ.1.87 లక్షల కోట్లు వసూళ్లే అత్యధిక జీఎస్టీ రాబడిగా ఉంది. దేశీయంగా లావాదేవీలు 13.4 శాతం వరకు పెరగడం వల్లనే అత్యధిక జీఎస్టీ రాబడి వచ్చినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2017, జూలైలో జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత నెలవారీగా ఎక్కువ వసూళ్ల జరగడం ఇదే.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, సమీక్షించిన నెలలో మొత్తం రూ. 2,10,267 కోట్ల జీఎస్టీ వసూళ్లు వచ్చాయి. అందులో సీజీఎస్టీ రూ. 43,846 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ. 53,538 కోట్లు, ఐజీఎస్టీ రూ. 99,623 కోట్లు(దిగుమతులపై వసూలైన రూ. 37,826 కోట్లతో సహా), సెస్ రూపంలో రూ. 13,260 కోట్లు(దిగుమతులపై వసూలైన రూ. 1,008 కోట్లతో కలిపి) ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో గత నెల రూ. 6,236 కోట్ల జీఎస్టీ ఆదాయం నమోదైంది. గతేడాది ఇదే నెలలో వచ్చిన రూ. 5,622 కోట్ల కంటే ఈసారి 11 శాతం పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ 12 శాతం వృద్ధితో రూ. 4,850 కోట్ల జీఎస్టీ రాబడి నమోదైంది.

ఇప్పటివరకు నమోదైన టాప్-5 అత్యధిక జీఎస్టీ వసూళ్లు..

2024, ఏప్రిల్‌ - రూ.2.10 లక్షల కోట్లు

2023, ఏప్రిల్‌ - రూ.1.87 లక్షల కోట్లు

2024, మార్చి - రూ.1.78 లక్షల కోట్లు

2024, జనవరి - రూ.1.74 లక్షల కోట్లు

2023, అక్టోబరు - రూ.1.72 లక్షల కోట్లు

Next Story