CII Conference: 2047 నాటికి మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 70 శాతం మహిళలు

by S Gopi |   (  Updated:2025-03-20 13:29:20  IST  )

మహిళా పారిశ్రామికవేత్తలకు అవసరమైన స్థాయిలో మార్గదర్శకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు.

CII Conference: 2047 నాటికి మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 70 శాతం మహిళలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను చేరేందుకు దేశంలోని మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 70 శాతం మహిళలు ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కేంద్ర కార్మిక కార్యదర్శి సుమితా దవ్రా తెలిపారు. బుధవారం పరిశ్రమల సంఘం సీఐఐ నిర్వహించిన సదస్సులో సేవా రంగంలో మహిళల పాత్ర అంశంపై మాట్లాడిన ఆమె.. మహిళా పారిశ్రామికవేత్తలకు అవసరమైన స్థాయిలో మార్గదర్శకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. సేవా రంగమే కాకుండా మహిళలు అనేక రంగాల్లో గొప్ప సామర్థ్యాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్‌లను నిర్వహిస్తున్న మహిళలకు వెంచర్ కేపిటల్ మద్దతు పెరిగే చర్యలు ఉండాలన్నారు. ఇదే సమయంలో సేవా రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావించిన సుమితా దవ్రా, వర్క్‌ఫోర్స్‌లో మహిళలు ముందుకొచ్చే సందర్భంగా పక్షపాతం ఉండొచ్చు. లీడర్‌షిప్ స్థాయిలో మహిళలకు అందే వేతనాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. ఉద్యోగ భద్రతలో ఆందోళనలు, ఇల్లు-వృత్తిపరమైన బాధ్యతలను సమతుల్యం చేయడంలో మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాదాపు 45 శాతం మంది మహిళలు వర్క్‌ఫోర్స్‌లో చేరేందుకు పిల్లల సంరక్షణ, ఇంటి కట్టుబాట్లు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. గత కొంతకాలంగా ఈ అంశాల్లో మార్పులు జరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. గత ఆరేళ్లలో ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం మెరుగుపడిందని ఆమె పేర్కొన్నారు.

Next Story