భారత్‌లో తయారీని పెంచుతున్న గ్లోబల్ టాయ్ కంపెనీలు

by Dishanational1 |
భారత్‌లో తయారీని పెంచుతున్న గ్లోబల్ టాయ్ కంపెనీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత బొమ్మల ఎగుమతులు గత కొన్నేళ్లలో గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా చైనాలో కంపెనీలకు కార్యకలాపాలు నష్టాన్ని తెచ్చిపెడుతుండటంతో వారు భారత్‌లో తయారీని వేగంగా పెంచారు. దీనివల్ల భారత బొమ్మల పరిశ్రమ 2015 నుంచి 2023 మధ్య కాలంలో అత్యంత వేగంగా పెరిగింది. ఎగుమతులు 239 శాతం పెరిగాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో దిగుమతులు 52 శాతం క్షీణించాయి. ప్రధానగా భారత్‌లో బొమ్మల అమ్మకాలకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ఆమోదం తప్పనిసరి చేయడం, చైనా ప్లస్ వ్యూహం, ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 70 శాతానికి పెంచడం వంటి కీలక నిర్ణయాలు పరిశ్రమ వృద్ధికి దోహదపడ్డాయి. పరిశ్రమ వర్గాల ప్రకారం, హాస్‌బ్రో, మాటెల్, స్పిన్ మాస్టర్, ఎర్లీ లెర్నింగ్ సెంటర్ లాంటి గ్లోబల్ బ్రాండ్లు భారత్‌పై ఆధారపడుతున్నాయి. అలాగే, ఇటాలియన్ దిగ్గజం డ్రీమ్ ప్లాస్ట్, మైక్రో ప్లాస్ట్, ఇంకాస్ వంటి బడా కంపెనీలు చైనాను వీడి భారత మార్కెట్లో తయారీని పెంచేందుకు దృష్టి సారిస్తున్నాయి. బీఐఎస్ విధానానికి ముందు భారత్ బొమ్మల కోసం 80 శాతం మేర ఆధారపడి ఉండేదని, అది ఇప్పుడు గణనీయంగా తగ్గిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్ పరిశోధనా సంస్థ ఐఎంఏఆర్‌సీ నివేదిక ప్రకారం, 2023లో భారత బొమ్మల పరిశ్రమ విలువ రూ. 14 వేల కోట్లుగా ఉంది. 2032 నాటికి ఇది రూ. 36.5 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా.


Next Story