Gautam Adani: అదానీ పోర్ట్స్‌ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బాధ్యతల నుంచి నిష్క్రమించిన గౌతమ్ అదానీ

by S Gopi |

ఈ నిర్ణయం మంగళవారం(ఆగష్టు 5) నుంచే అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది.

Gautam Adani: అదానీ పోర్ట్స్‌ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బాధ్యతల నుంచి నిష్క్రమించిన గౌతమ్ అదానీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: బిలియనీర్, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్(సెజ్) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని అదానీ పోర్ట్స్ బోర్డు డైరెక్టర్లు మంగళవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపారు. గౌతమ్ అదానీ కంపెనీ కీలక నిర్వహక పాత్ర నుంచి వైదొలిగారని వెల్లడించారు. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌గా ఉన్న గౌతమ్ అదానీ దేశంలోనే అతిపెద్ద పోర్ట్ నిర్వహణ సంస్థ అయిన అదానీ పోర్ట్స్‌కు ఇకపై నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ నిర్ణయం మంగళవారం(ఆగష్టు 5) నుంచే అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఇదే సమయంలో మనీష్ కేజ్రీవాల్‌ను 3 సంవత్సరాల ప్రారంభ కాలానికి అదనపు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించింది. గౌతమ్ అదానీ ఈ బాధ్యతలను వదులుకోవడం వెనుక కారణాలు తెలియనప్పటికీ, ఇటీవల పరిణామాల్లో ఆంక్షల ఉల్లంఘణ, లంచం ఆరోపణలపై దర్యాప్తు సహా అమెరికా అధికారుల నుంచి చట్టపరమైన ఇబ్బందుల నేపథ్యంలో రోజూవారీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించినట్టు సమాచారం. అయితే, ఈ మార్పు వల్ల అదానీ పోర్టులపై ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చు. అదానీ పోర్ట్స్ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 21 శాతం ఆదాయ వృద్ధిని, సరుకు రవాణాలో 11 శాతం పెరుగుదలను నమోదు చేయగలిగింది. కాగా, మంగళవారం మార్కెట్లు ముగిసే సమయానికి అదానీ పోర్ట్స్ షేర్ ధర 2 శాతం మేర క్షీణించి రూ. 1,361.90 వద్ద ఉంది.

Next Story