ప్రపంచ కుబేరుల్లో అత్యధిక సంపదను కోల్పోయిన అంబానీ, అదానీ!

by Disha Web Desk 17 |
ప్రపంచ కుబేరుల్లో అత్యధిక సంపదను కోల్పోయిన అంబానీ, అదానీ!
X

న్యూఢిల్లీ: దేశీయ అత్యంత సంపన్నులైన ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎక్కువ సంపదను కోల్పోయినవారుగా నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలీయనీర్స్ ఇండెక్స్ తాజా డేటా ప్రకారం, ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్నవారిలో ఈ ఇద్దరు భారతీయ కుబేరులు అత్యధికంగా సంపదను కోల్పోయారు.

ఈ ఏడాదికి సంబంధించి గౌతమ్ అదానీ సంపద ఏకంగా 78 బిలియన్ డాలర్ల(రూ. 6.45 లక్షల కోట్ల)కు పైగా క్షీణించింది. మరోవైపు ముఖేశ్ అంబానీ సంపద ఈ ఏడాది ప్రారంభం నుంచి 5 బిలియన్ డాలర్లు(రూ. 41 వేల కోట్ల)ను కోల్పోయారు. ఈ నెల ప్రారంభంలో అదానీ దాటి ముఖేశ్ అంబానీ ప్రపంచ అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు.

తాజా గణాంకాల ప్రకారం గురువారం నాటికి ముఖేశ్ అంబానీ సంపద విలువ నికరంగా రూ. 6.73 లక్షల కోట్లతో ప్రపంచ 12వ కుబేరుడిగా ఉన్నారు. ఇక, గౌతమ్ అదానీ, గతేడాది ప్రపంచ రెండో అత్యంత సంపన్నుడి స్థాయి నుంచి పడిపోయి రూ. 3.52 లక్షల కోట్లతో ఇండెక్స్‌లో 29వ స్థానానికి దిగజారారు.

ఈ ఏడాది జనవరి 24న అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ గౌతమ్ అదానీపై షేర్ల ధరల అవకతవకలు, అకౌంటింగ్ మోసాలు వంటి ఆర్థిక ఆరోపణలు చేయడంతో అదానీ గ్రూప్ భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. దానిపై సంస్థ నిరాధారమని ప్రకటించినప్పటికీ కంపెనీల షేర్లపై ప్రతికూల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. దానివల్లే గౌతమ్ అదానీ సంపద పేకమేడలా కుప్పకూలుతోంది.

Next Story

Most Viewed