ఈ నెలలో రూ. 2,440 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విదేశీ పెట్టుబడిదారులు!

by Disha Web Desk 16 |
ఈ నెలలో రూ. 2,440 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విదేశీ పెట్టుబడిదారులు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి గత నెలలో రూ. 7,600 కోట్ల విలువైన నిధులను ఉపసంహరించిన విదేశీ పెట్టుబడిదారులు ఈ నెలలో తిరిగి కొనుగోళ్లను ప్రారంభించారు. అక్టోబర్‌లో మొదటి వారం రోజుల్లో భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) రూ. 2,440 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

దేశీయ పరిణామాలతో పాటు అంతర్జాతీయ అంశాల కారణంగా రానున్న నెలల్లో కూడా ఎఫ్ఐఐల పెట్టుబడుల ధోరణి అస్థిరంగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, అమెరికా ఫెడ్ నిర్ణయాలు, రూపాయి బలహీనత కారణంగా సెప్టెంబర్‌లో ఎఫ్ఐఐలు రూ. 7,600 కోట్లను వెనక్కి తీసుకెళ్లారు. విదేశీ పెట్టుబడిదారులు అంతకుముందు ఆగష్టులో రూ. 51,200 కోట్లు, జూలైలో రూ. 5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు.

ఈ నెలలో సానుకూల సంకేతాలతో తిరిగి పెట్టుబడులను కొనసాగించారు. అయితే, ప్రస్తుతం నమోదవుతున్న కొనుగోళ్లలో స్థిరత్వం లేదని, భారత ఈక్విటీ మార్కెట్లలో క్రమంగా విదేశీ పెట్టుబడులు రాకపోవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి కె విజయకుమార్ అన్నారు. డాలర్ ఇండెక్స్ గరిష్ఠ స్థాయికి చేరితేనే విదేశీ పెట్టుబడిదారులు స్థిరంగా భారత మార్కెట్లలో పెట్టుబడులు కొనసాగిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశీయంగా జీఎస్టీ, ప్రత్యక్ష పన్ను వసూళ్లు మెరుగ్గా ఉండటంతో ప్రభుత్వం వ్యయం పెరగనుంది. దీనివల్ల వృద్ధి వేగవంతమవుతుందని అంచనా. దీనివల్ల భారత మార్కెట్లలో పెట్టుబడులకు ఎఫ్ఐఐలు సానుకూలంగా చూస్తారని నిపుణులు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు విదేశీ మదుపర్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 1.66 లక్షల కోట్లను ఉపసంహరించుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి.


Next Story

Most Viewed