నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా బీవీఆర్ సుబ్రమణ్యం!

by Disha Web Desk 17 |
నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా బీవీఆర్ సుబ్రమణ్యం!
X

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ)గా మాజీ వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యంను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుబ్రమణ్యం నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని, ఆయన బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రెండేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు నీతి ఆయోగ్ సీఈఓగా ఉంటారని సిబ్బంది వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

గతేడాది జూన్‌లో నీతి ఆయోగ్ సీఈఓగా నియమితులైన పరమేశ్వరన్ అయ్యర్ ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వెళ్లనున్నారు. ఆ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగుతారు. నీతి ఆయోగ్‌లో అయ్యర్ ఎనిమిది నెలల కంటే తక్కువ కాలం బాధ్యతలను నిర్వహించారు.

ప్రభుత్వాధికారిగా 2009లో స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన అయ్యర్, 2014లో కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా ఎన్నికైన బీవీఆర్ సుబ్రమణ్యం చత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన 2022, సెప్టెంబర్ 30న వాణిజ్య కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.



Next Story

Most Viewed