భారత మార్కెట్లోకి ఫోర్డ్ 'రీ-ఎంట్రీ'

by Dishanational1 |
భారత మార్కెట్లోకి ఫోర్డ్ రీ-ఎంట్రీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా వాహనాల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్స్ రెండేళ్ల క్రితం భారత మార్కెట్ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చెన్నైలో కంపెనీకి చెందిన ప్లాంటును విక్రయించేందుకు వివిధ సంస్థలతో చర్చలు కూడా నిర్వహించింది. అయితే, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ప్లాంటు అమ్మాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే ప్లాంటులో కంపెనీ తిరిగి ఉత్పత్తిని పునఃప్రారంభించి భారత మార్కెట్లో రీ-ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దేశీయ వాహన మార్కెట్లో గతేడాది నుంచి ఎస్‌యూవీ మోడల్ కార్లకు అధిక డిమాండ్ కనిపిస్తోంది. దీంతో ఫోర్డ్ తన ప్రీమియం ఎస్‌యూవీ మోడల్ ఎండీవర్‌ను మళ్లీ మార్కెట్లో విడుదల చేయాలని ప్రయత్నిస్తోంది. చెన్నైలోని మరైమలై నగర్‌లో ఉన్న ఫోర్డ్ ప్లాంట్ సంవత్సరానికి 2,00,000 వాహనాలు, 3,40,000 ఇంజన్‌లను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. గతేడాదిలోనే కంపెనీ తన అంతర్జాతీయ మార్కెట్ కోసం చెన్నై ప్లాంటులో ఈవీలను ఉత్పత్తి చేయాలనే ఆలోచనను విరమించుకుంది. తాజాగా ఫోర్డ్‌ సీవోవోగా భారత్‌కు చెందిన కుమార్‌ గల్హోత్రాను నియమించిన తర్వాత కంపెనీ దేశీయ మార్కెట్లోకి మళ్లీ వస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి.


Next Story

Most Viewed