Nitin Gadkari: ఫుడ్ డెలివరీ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు: నితిన్ గడ్కరీ

by S Gopi |

ప్రస్తుతం దేశంలో 77 లక్షల మంది డెలివరీ ఉద్యోగులు ఉన్నారని, ఈ సంఖ్య 2030 నాటికి 2.5 కోట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు.

Nitin Gadkari: ఫుడ్ డెలివరీ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు: నితిన్ గడ్కరీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: పెద్ద ఎత్తున ఉపాధిని సృష్టిస్తున్న ఫుడ్ డెలివరీ రంగం దేశానికి చాలా కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం అన్నారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోడ్డు రవాణా, రహదారుల మంత్రి గడ్కరీ.. ప్రస్తుతం దేశంలో 77 లక్షల మంది డెలివరీ ఉద్యోగులు ఉన్నారని, ఈ సంఖ్య 2030 నాటికి 2.5 కోట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు. 2.5 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడం అనేది దేశానికి ఎంతో పెద్ద విషయం.. మనకు ఉద్యోగాల కల్పనే అత్యంత ప్రధానమైన అంశమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నందుకు జొమాటోను మంత్రి అభినందించారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. డెలివరీ ఏజెంట్లు పరిమిత సమయంలో వస్తువులను డెలివరీ చేయవలసి ఉన్నందున ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలో గంటకు 45 రోడ్డు ప్రమాదాలు, 20 మరణాలు సంభవిస్తున్నాయని గడ్కరీ తెలిపారు. అందులోనూ 18-45 ఏళ్ల వయస్సు మధ్య వారు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో టూ-వీలర్ నడిపే వారి సంఖ్య 80,000 కాగా.. హెల్మెట్‌ వాడకపోవడం వల్ల 55,000 మంది మరణిస్తున్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల 10,000 మరణాలు జరుగుతున్నాయని చెప్పారు. సరైన శిక్షణ అందించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని మంత్రి జొమాటో సూచించారు.

Next Story