Finance Ministry: ఆర్‌బీఐ గోల్డ్ లోన్ మార్గదర్శకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచనలు

by S Gopi |

చిన్న మొత్తం బంగారు రుణాలు తీసుకునే వారిపై ప్రభావితం లేకుండా చూసేందుకే ఈ సూచన చేసినట్టు మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.

Finance Ministry: ఆర్‌బీఐ గోల్డ్ లోన్ మార్గదర్శకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచనలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బంగారం రుణాలపై కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీటికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది. రూ. 2 లక్షల కంటే తక్కువ విలువైన బంగార రుణాలు తీసుకునే వారిని ఈ మార్గదర్శకాల నుంచి మినహాయించాలని ఆర్‌బీఐకి సూచించింది. ఆర్‌బీఐ జారీ చేసిన ముసాయిదా ఆదేశాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) పరిశీలించింది. చిన్న మొత్తంలో బంగారు రుణాలు తీసుకునే వారిపై ప్రతికూల ప్రభావితం లేకుండా చూసేందుకే ఈ సూచన చేసినట్టు మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఇదే సమయంలో మార్గదర్శకాలను క్షేత్ర స్థాయిలో అమలు చేయడానికి తగినంత సమయం అవసరమని, దాన్ని దృష్టిలో ఉంచుకుని 2026, జనవరి 1 నుంచి అమలులోకి తీసుకురావాలని డీఎఫ్ఎస్ సిఫార్సు చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలపై రాజకీయంగా కూడా భాగస్వామ్య పక్షాల నుంచి వస్తున్న అసంతృప్తుల కారణంగా ప్రభుత్వం ఆర్‌బీఐకి సూచనలు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తీసుకొచ్చిన ముసాయిదాలో బంగారం తాకట్టు పెట్టుకునే ఇచ్చే రుణాన్ని దాని విలువలో 75 శాతం కంటే ఎక్కువ ఉండకూడదని ఆర్‌బీఐ తెలిపింది. ఈ నిర్ణయం వల్ల చిన్న, సన్నకారు రైతులకు రుణాలు తీసుకోవడం ఇబ్బందిగా మారుతుందనే వాదన తెరపైకి వచ్చింది. ముఖ్యంగా తమిళనాడులోని రాజకీయ పార్టీలు ఈ అంశంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వినిపిస్తున్నాయి. ఈ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ కూడా రాశారు.

Next Story