Finance Ministry: చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌లను వాడొద్దని ఉద్యోగులకు ఆర్థికశాఖ ఆదేశాలు

by S Gopi |

ప్రభుత్వ పత్రాలు, డేటా గోప్యతకు ప్రమాదం ఎదురయ్యే అవకాశాలు ఉన్నందున ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Finance Ministry: చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌లను వాడొద్దని ఉద్యోగులకు ఆర్థికశాఖ ఆదేశాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక శాఖ తన ఉద్యోగులకు కీలక ఆదేశాలిచ్చింది. చాట్‌జీపీటీ, డీప్‌సీక్ ఆర్1 లాంటి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) టూల్స్‌ను వాడొద్దని వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వ పత్రాలు, డేటా గోప్యతకు ప్రమాదం ఎదురయ్యే అవకాశాలు ఉన్నందున ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ అధికారులు ధృవీకరించారు, కానీ పూర్తి స్థాయిలో ఆదేశాల గురించి తెలియాల్సి ఉంది. ఆర్థిక శాఖ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, పరికరాల్లో ఏఐ టూల్స్, ఏఐ యాప్‌లను వాడొద్దని, వాటివల్ల ప్రభుత్వ డేటా, డాక్యుమెంట్లకు ప్రమాదం కలిగించవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటికే ఇటలీ, ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా ఏఐ యాప్ డీప్‌సీక్‌ ఆర్1పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ డేటాకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందనే ఆందోళనల మధ్య ఆయా దేశాలు ఆంక్షల నిర్ణయం తీసుకున్నాయి. ఇటీవల కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ చైనా ఏఐ స్టార్టప్‌ను భారత సర్వర్ల నుంచే హోస్ట్‌ చేయనున్నట్టు చెప్పారు. డేటా గోప్యతకు సంబంధించి సమీక్షించాలని, డేటా భద్రతపై అంచనా వేసేందుకు ప్రతి యాప్ లేదా సిస్టమ్ పరీక్షిస్తామని, దాని ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు. అంతేకాకుండా మన దేశంలోనే రూపొందించే ఏఐ మోడల్‌ను ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు.

Next Story