ఉద్యోగులను బయటకు పంపేస్తున్న మరో కంపెనీ!

by Disha Web Desk 17 |
ఉద్యోగులను బయటకు పంపేస్తున్న మరో కంపెనీ!
X

బెంగళూరు: ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ కంపెనీ అన్అకాడెమీ తాజాగా 12 శాతం ఉద్యోగుల లేఆఫ్స్‌ను ప్రకటించింది. అంటే దాదాపు దాదాపు 380 మంది ఉద్యోగులను సంస్థ తొలగించనుంది. ఈ మేరకు కంపెనీ సీఈఓ గౌరవ్ ముంజాల్ గురువారం ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో పేర్కొన్నారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యూనికార్న్ కంపెనీ ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ప్రధాన వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చేందుకు, సరైన వ్యూహంతో వృద్ధిని కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని సీఈఓ మెమోలో వివరించారు. తొలగింపుల్లో భాగంగా ప్రభావితమైన ఉద్యోగులకు నోటీసు పీరియడ్, అదనపు నెల వేతనంతో సమానమైన వేతనాన్ని ఇస్తామని, బీమా కవరేజ్ ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వరకు చెల్లుబాటు అవుతుందని కంపెనీ తెలిపింది. అలాగే ఇతర ఉద్యోగాలను వెతుక్కోవడంలో వారికి అవసరమైన సహాయం అందుతుంది.

అయితే, తాజా లేఆఫ్స్‌లో ఏయే విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితమయ్యారనే విషయంపై కంపెనీ స్పష్టం చేయలేదు. కాగా, అన్అకాడెమీ గడిచిన ఏడాది కాలంలో పలు దశల్లో ఉద్యోగుల తొలగింపులను అమలు చేసింది. 2022, ఏప్రిల్‌లో 1,000 మంది కాంట్రాక్టు, శాశ్వత ఉద్యోగులను తీసివేసింది. ఆ తర్వాత నవంబర్‌లో 350 మందిని, ఈ ఏడాది జనవరిలో 40 మందిని ఇంటికి సాగనంపింది.


Next Story

Most Viewed