Anil Ambani: రిలయన్స్ గ్రూప్‌ కేసులో కొత్తగా రూ.581 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ

by S Gopi |

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన ఆర్‌హెచ్ఎఫ్ఎల్, ఆర్‌సీఎఫ్ఎల్ కంపెనీలకు చెందిన కొత్త ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ గురువారం ప్రకటనలో తెలిపింది.

Anil Ambani: రిలయన్స్ గ్రూప్‌ కేసులో కొత్తగా రూ.581 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి వరుస ఎదురుదెబ్బలు తప్పట్లేదు. ఈ నెల ప్రారంభంలోనే రిలయన్స్ పవర్‌కు సంబంధించి పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన ఆర్‌హెచ్ఎఫ్ఎల్, ఆర్‌సీఎఫ్ఎల్ కంపెనీలకు చెందిన కొత్త ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ గురువారం ప్రకటనలో తెలిపింది. గోవా, కేరళ, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లలో ఉన్న భూములను అటాచ్ చేయాలని మార్చి 11న ఉత్తర్వు జారీ చేసినట్లు పేర్కొంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్ఎఫ్ఎల్), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్ఎల్)లకు చెందిన రూ.581.65 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఈడీ స్పష్టం చేసింది. మార్చి 6న విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) కింద రిలయన్స్ పవర్ లిమిటెడ్‌పై జరిగిన కేసులో సోదాల నేపథ్యంలో ఈ అటాచ్‌మెంట్ జరిగింది. దీంతో రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ అటాచ్‌మెంట్ మొత్తం విలువ రూ.16,310 కోట్లకు చేరుకుందని ఈడీ వెల్లడించింది. అనిల్‌ అంబానీకి చెందిన కంపెనీలు రూ. వేల కోట్ల విలువైన బ్యాంకు రుణాల మోసం ఆరోపణలతో ఆయనపై ఈడీ కేసు నమోదు చేసింది.

Next Story