HDFC Bank: ఆన్‌లైన్ మోసాలపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక హెచ్చరిక

by S Gopi |   (  Updated:2025-08-05 15:26:16  IST  )

కస్టమర్లతో మాట్లాడిన తర్వాత ఏపీకే ఫైల్స్ పంపి తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేయమని కోరుతున్నారు.

HDFC Bank: ఆన్‌లైన్ మోసాలపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక హెచ్చరిక
X

దిశ, బిజినెస్ బ్యూరో: సైబర్ మోసాల పట్ల ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మంగళవారం కీలక హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా తమ బ్యాంకు కస్టమర్లు ఏపీకే(ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీకే స్కామ్‌లో సైబర్ మోసగాళ్లు సాధారణంగా బ్యాంక్ ఉద్యోగులు లేదా ప్రభుత్వ అధికారుల పేర్లతో నటించి సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలను ఉపయోగిస్తున్నారు. కస్టమర్లతో మాట్లాడిన తర్వాత ఏపీకే ఫైల్స్ పంపి తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేయమని కోరుతున్నారు. అనంతరం కస్టమర్ల స్మార్ట్‌ఫోన్‌లను తమ కంట్రోల్‌లోకి తీసుకుంటున్నారని, బ్యాంకు ఖాతాల్లో ఉండే సొమ్మును కాజేస్తున్నట్టు బ్యాంకు తెలిపింది. ఏవైనా మెసేజ్‌ల రూపంలో తమ ఫోన్‌కు ఏపీకే ఫైల్స్ వస్తే, అటువంటి వాటిని డౌన్‌లోడ్ చేయడం, ఉపయోగించడం లాంటిది చేయొద్దని స్పష్టం చేసింది. కస్టమర్లు థర్డ్ పార్టీ యాప్స్‌ను అస్సలు వాడొద్దని, ఏవైనా లింక్‌లు వస్తే అవి విశ్వసనీయమైనవేనా కాదా తనిఖీ చేసుకోవాలని పేర్కొంది. సైబర్ మోసగాళ్లు ఏపీకే ఫైల్స్‌ను స్మార్ట్‌ఫోన్‌లకు పంపి, వాటిని ఇన్‌స్టాల్ చేసేలా ప్రేరేపిస్తారు. ఆ త్ర్వాత సదరు ఫోన్‌లపై పూర్తి నియంత్రణ తీసుకుని కాల్స్, మెసేజ్‌లను మరొక డివైజ్‌కు షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత కస్టమర్ ఫోన్‌లో ఉండే మొత్తం డేటాను దొంగిలిస్తారు. బ్యాంక్ ఖాతా యాక్సెస్ చేయవచ్చు, లావాదేవీలు నిర్వహించవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హెచ్చరించింది.

Next Story