మళ్లీ 60 వేలు దాటిన సెన్సెక్స్!

by Dishafeatures2 |
మళ్లీ 60 వేలు దాటిన సెన్సెక్స్!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు అధిక లాభాలతో రాణించాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో కొనుగోళ్ల జోరు కారణంగా సూచీలు అర శాతానికి పైగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలున్నప్పటికీ దేశీయ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో సానుకూల ప్రభావం చూపడంతో లాభాలు నమోదయ్యాయి. రోజంతా ఓ మోస్తరుగా కదలాడిన సూచీలు చివరి అర గంటలో మదుపర్లు కొనుగోళ్లను పెంచడంతో లాభాలు పెరిగాయి. దానివల్ల బెంచ్‌మార్క్ సెన్సెక్స్ ఇండెక్స్ తిరిగి 60 వేల మార్కును అధిగమించింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 401.04 పాయింట్లు ఎగసి 60,056 వద్ద, నిఫ్టీ 119.35 పాయింట్లు లాభపడి 17,743 వద్ద ముగిశాయి.

నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్, రియల్టీ రంగాలు 1 శాతానికి పైగా పెరిగాయి. మీడియా రంగం బలహీనపడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో విర్పో, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఆల్ట్రా సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకి, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 81.92 వద్ద ఉంది.


Next Story