- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త ఏసీ కొనాలనుకుంటున్నారా? ఆలస్యం చేస్తే జేబుకు చిల్లే!
వేసవికాలం ఆరంభంలోనే ఏసీ ధరలకు రెక్కలొచ్చాయి. వీటిని కొనాలనుకునేవీరు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదంటున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో : ఎండాకాలం మొదట్లోనే ఏసీలు వేడెక్కుతున్నాయి. సీజన్ కావడంతో ఎయిర్ కండిషనర్(ఏసీ) తయారీదారులు ధరలు పెంచుతున్నాయి. ఇప్పటికే కొన్ని బ్రాండ్లు పెంచేయగా, మరికొన్ని కంపెనీలు ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏసీ కొనాలనుకునేవారు ఇప్పుడే కొనడం బెటర్ అని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. కీలక విడిభాగాల ఖర్చులకు తోడు నిబంధనల కారణంగా మరికొన్ని బ్రాండ్ల ఏసీలు ధరలు అమాంతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ రూమ్ ఏసీ తయారీదారులు అధిక ముడి పదార్థాలు, సరఫరా ఖర్చులను భర్తీ చేయడానికి ధరలను కనీసం 5–15 శాతం మేర పెంచుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభం నుంచే డిమాండ్ కారణంగా కంపెనీలు పెంపును మొదలుపెట్టాయి. డైకిన్, వోల్టాస్, బ్లూ స్టార్, ఎల్జీ, హైయర్, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ వంటి ప్రధాన బ్రాండ్లు అనేక మోడళ్లలో ధరల పెంపును ప్రకటించాయి. తయారీ ఖర్చులతోపాటు రానున్న వేసవికి ఏసీలకు మరింత డిమాండ్ ఉంటుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే డీలర్లు కూడా పెద్దఎత్తున స్టాక్ కొని పెట్టుకుంటున్నారు.
ఎందుకు పెరుగుతున్నాయ్?..
ఏసీ ధరలను పలు అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏసీల తయారీకి ఉపయోగించే రాగి, అల్యూమినియం లాంటి కీలక ఇన్పుట్ ఖర్చులు పెరగడం, మన కరెన్సీ రూపాయి బలహీనపడటం, పెరుగుతున్న సరుకు రవాణా ఖర్చులు, కొత్త ఇంధన-సామర్థ్య నిబంధనల అమలు కారణంగా ధరలు పెంచుతున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏసీలో కీలకమైన కంప్రెసర్లు, కాయిల్స్ తయారీ కోసం రాగి అవసరం. గ్లోబల్ మార్కెట్లో రాగి ధరలు భారీగా పెరగడంతో ఏసీల తయారీ ఖర్చు భారంగా మారిందని కంపెనీలు పేర్కొంటున్నాయి. మరోవైపు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల విడిభాగాల కొరత ఏర్పడటంతోపాటు రవాణా ఖర్చులూ పెరిగాయి. ఫలితంగా దిగుమతుల ఖర్చు పెరిగింది. కాబట్టి ప్రత్యామ్నాయం లేకపోవడంతో ధరలు పెంచక తప్పట్లేదని డైకిన్ ఇండియా చైర్మన్, ఇండియా కన్వల్జీత్ జావా చెప్పారు. ఇక ప్రభుత్వం ఇంధన సామర్థ్యానికి సంబంధించి ఇప్పటికే కఠినమైన నిబంధనలు తీసుకొచ్చింది. తక్కువ విద్యుత్ ఖర్చయ్యేలా ఏసీలను అప్గ్రేడ్ చేయాలని కంపెనీలకు స్పష్టం చేసింది.
డిమాండ్ కూడా..
ఈ ఏడాదికి సంబంధించి భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఇప్పటికే మార్చి-మే మధ్య ఎక్కువ ఎండ వేడిమి ఉంటుందని వెల్లడించింది. దీంతో ఏసీలకు డిమాండ్ కూడా పెరుగుతోంది. ఇప్పటికే కేంద్రం అమలు చేసిన జీఎస్టీ తగ్గింపు వల్ల ఏసీలకు గిరాకీ రెండు, మూడు నెలల నుంచే క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇలాంటప్పుడు ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఏసీలు కొనడానికి మొగ్గు చూపుతున్నారు. డిమాండ్ భర్తీకి, ఖర్చుల భారాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ధరల పెంపు నిర్ణయాన్ని అమలు చేస్తున్నాయి. అయితే జీఎస్టీ కోతల వల్ల సామాన్యులు ఏసీల వంటి ఉత్పత్తులపై ఉపశమనం పొందారు. కానీ, దేశీయ, అంతర్జాతీయ పరిణామాల వల్ల మళ్లీ ఏసీల ధరలు భారం కానున్నాయి.
ఏ కంపెనీ ఎంతెంత?..
ఇప్పటికే కొన్ని కంపెనీలు ఏసీల ధరలను పెంచగా, మరికొన్ని కంపెనీలు త్వరలో పెంపు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాయి. డైకిన్ ఇండియా 7–12 శాతం పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ నుంచి కొత్త ధరలు అమలవుతాయని పేర్కొన్నది. వోల్టాస్ కూడా 5-15 శాతం, బ్లూస్టార్ 8-10 శాతం, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా 7 శాతం(3 స్టార్), 9-10 శాతం(5-స్టార్), హిటాచీ 5–7 శాతం, హైయర్ ఇండియా 5 శాతం(3 స్టార్), 8 శాతం(5-స్టార్), మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ 5 శాతం పెంచేశాయి. పానాసోనిక్, లాయిడ్ కంపెనీలు కూడా మిగిలిన కంపెనీల బాటలోనే ధరలు పెంచుతామని సంకేతాలిచ్చాయి.






