బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు రూ. 89 వేల కోట్ల ప్యాకేజీకి కేంద్రం ఆమోదం!

by Disha Web Desk 13 |
బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు రూ. 89 వేల కోట్ల ప్యాకేజీకి కేంద్రం ఆమోదం!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) పునరుద్ధరణ కోసం రూ. 89,047 కోట్ల విలువైన భారీ ప్యాకేజీని కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఆమోదించింది. ఈ నిధుల ద్వారా బీఎస్ఎన్ఎల్‌కు 4జీ, 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరగనున్నాయి. పేలవమైన మౌలిక సదుపాయాలతో పోరాడుతున్న బీఎస్ఎన్ఎల్ సంస్థ రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలతో పోటీ పడుతోంది. ఈ క్రమంలోనే 4జీ సేవలను ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్ సేవల నాణ్యతను మరింత పెంచేందుకు ఇటీవల టాటాకు చెందిన టీసీఎస్‌తో జతకట్టింది.

టీసీఎస్ నేతృత్వంలోని కన్సార్టియంకు రూ. 15 వేల కోట్ల విలువైన ఆర్డర్ ఇచ్చింది. ఈ భాగస్వామ్యంతో టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేయనుంది. అలాగే, ఐటీఐ కంపెనీకి రూ. 3,889 కోట్ల విలువైన 4జీ టెలికాం గేర్ సరఫరా కాంట్రాక్టును కూడా అప్పగించింది. గతేడాది బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు ప్రభుత్వం రూ. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఇది నాలుగేళ్లలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ పునరుద్ధరణ ప్యాకేజీ ద్వారా బీఎస్ఎన్ఎల్ దేశంలోని మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీని అందించడంపై దృష్టి సారిస్తుంది. ఇక, అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికమ్యూనికేషన్స్ కంపెనీ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్)ని మూసివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సంకేతాలొస్తున్నాయి.


Next Story

Most Viewed