BIF: మెసేజింగ్ యాప్‌ల కోసం సిమ్-బైండింగ్ ఆదేశాలపై ఆందోళన వ్యక్తం చేసిన బీఐఎఫ్

by S Gopi |

సిమ్-బైండింగ్ సమస్యపై వాటాదారుల నుంచి సంప్రదింపులు జరపాలని కేంద్రాన్ని కోరింది.

BIF: మెసేజింగ్ యాప్‌ల కోసం సిమ్-బైండింగ్ ఆదేశాలపై ఆందోళన వ్యక్తం చేసిన బీఐఎఫ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: మొబైల్‌ఫోన్‌లో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌ల వినియోగానికి యాక్టివ్ సిమ్‌ తప్పనిసరి అని కేంద్రం ఇటీవల ఇచ్చిన ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం (బీఐఎఫ్) మంగళవారం దీనిపై తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేసింది. ఈ ఫోరమ్ మెటా, గూగుల్‌ లాంటి టెక్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ నిబంధనలను అమలు చేయడాన్ని తక్షణం నిలిపివేయాలని, సిమ్-బైండింగ్ సమస్యపై వాటాదారుల నుంచి సంప్రదింపులు జరపాలని కేంద్రాన్ని కోరింది. విదేశాల నుంచి జరిగే సైబర్ మోసాలను నివారించేందుకు ఈ నిర్ణయం మంచిదే అయినప్పటికీ, వినియోగదారులపై ప్రభావం ఉంటుంది. అంతేకకుండా రిస్క్, అధికార పరిధి వంటి సందేహాలకు సమాధానం ఇందులో లేదని బీఐఎఫ్ అభిప్రాయపడింది. టెలికాం చట్ట ఆదేశాలు, టెలికాం సైబర్ భద్రతా నియమాలను విస్మరించినట్టు అవుతుందని తెలిపింది. టెలికాం విభాగం ఇచ్చిన ఆదేశాల వల్ల నిర్వహణ సమస్యలు తలెత్తుతాయని, ప్రజలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా, వారిపై పడే ప్రభావాలను పరిగణలోకి తీసుకోలేదని బీఐఎఫ్ అభిప్రాయపడింది. దీనిపై ఓఎస్ ప్రొవైడర్లు, టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్ యూజర్ ఎంటిటీలు, లైసెన్స్‌దారులు, భద్రతా నిపుణుల సాంకేతిక వర్కింగ్ గ్రూప్‌ వంటి వాటాదారులతో చర్చించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

Next Story