Stock Market: ఎనిమిది నెలల కనిష్టానికి స్టాక్ మార్కెట్లు

by S Gopi |

గ్లోబల్ మార్కెట్లకు సంబంధించి ప్రధాన టారిఫ్ భయాలు ఎక్కువ దెబ్బతీశాయి.

Stock Market: ఎనిమిది నెలల కనిష్టానికి స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. సోమవారం ట్రేడింగ్‌లోనూ సూచీలు వరుసగా ఐదవ సెషన్‌లో పతనమవడంతో స్టాక్ మార్కెట్లు ఎనిమిది నెలల కనిష్టానికి దిగజారాయి. గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ఉండటం, మన మార్కెట్ల నుంచి విదేశీ నిధుల తరలిపోతుండటం, యూఎస్ టారిఫ్‌లపై ఆందోళనలు కొనసాగడం వంటి అంశాలు ఎక్కువ ప్రభావితం చేశాయి.

ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో అనుసరించే ధోరణి విషయంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వీటికితోడు భౌగోళిక రాజకీయ పరిణామాలు మరోసారి ఉద్రిక్తంగా మారడం, దేశీయంగా కీలక ఐటీ, బ్యాంకింగ్, మెటల్ వంటి రంగాల షేర్లలో అమ్మకాల కారణంగా సోమవారం మదుపర్లు సుమారు రూ. 5.07 లక్షల కోట్లను కోల్పోయారు.

గ్లోబల్ మార్కెట్లకు సంబంధించి ప్రధాన టారిఫ్ భయాలు ఎక్కువ దెబ్బతీశాయి. ట్రంప్ అధిక టారిఫ్‌లను విధిస్తుండటం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందని, ఫలితంగా భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు దూరమవుతారని నిపుణులు భావిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం పెరగడం, మరికొన్నాళ్ల పాటు పశ్చిమాసియాలో పరిస్థితులు ఇలాగే ఉండొచ్చనే సంకేతాలు మార్కెట్ల నష్టాలకు కారణమయ్యాయి.

మరోవైపు, మన మార్కెట్ల విదేశీ మదుపర్లు ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ. లక్ష కోట్లను వెనక్కి తీసుకెళ్లడం, రూపాయి బలహీనపడటం, డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలు నిరాశపరచడం వరుస నష్టాలకు కారణమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 856.65 పాయింట్లు నష్టపోయి 74,454 వద్ద, నిఫ్టీ 242.55 పాయింట్లు క్షీణించి 22,553 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్ వంటి కీలక షేర్లు కుదేలయ్యాయి. అమెరికాతో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు బలహీనపడి రూ. 86.72 వద్ద ఉంది.

Next Story