జనవరి-సెప్టెంబర్ మధ్య 87 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు!

by Disha Web Desk 21 |
జనవరి-సెప్టెంబర్ మధ్య 87 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు!
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రధాన ఏడు నగరాల్లో ఇళ్ల అమ్మకాలు కరోనా ముందు స్థాయిని మించి నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే క్రమంలో కీలక వడ్డీ రేట్లు పెంచడంతో గృహ రుణాలపై వడ్డీ దశాబ్దపు కనిష్టం 6.5 శాతం నుంచి 8 శాతానికి పైకి చేరింది. అయితే, ఈ ప్రభావం హౌసింగ్ మార్కెట్‌పై కనిపించడంలేదని అనరాక్ అభిప్రాయపడింది. ఇదే సమయంలో గత ఏడాది కాలంలో ఇళ్ల ధరలు కూడా 10 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. కరోనా వల్ల చాలామంది సొంత ఇంటిని కావాలనుకోవడంతో ఇళ్ల అమ్మకాలు మెరుగైన వృద్ధిని సాధిస్తున్నాయని అనరాక్ తెలిపింది.

ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ అనరాక్ తాజా గణాంకాల్లో ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలోని ఏడు నగరాల్లో ఇళ్ల అమ్మకాలు ఏకంగా 87 శాతం పెరిగి 2,72,709 యూనిట్లుగా నమోదయ్యాయి. బలమైన డిమాండ్ కారణంగా 2019లో నమోదైన 2,61,358 యూనిట్ల కంటే ఈసారి ఎక్కువగా విక్రయించబడ్డాయి. గతేడాది ఇదే సమయంలో మొత్తం 1,45,651 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్నందున 2020లో ఇళ్ల అమ్మకాలు 1,38,344 యూనిట్లకు పరిమితమయ్యాయి.

నివేదిక ప్రకారం, ప్రధాన ఏడు నగరాల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఇళ్ల అమ్మకాలు రెండింతలు పెరిగి 49,138 యూనిట్లు అమ్ముడవగా, హైదరాబాద్‌లోనూ రెండు రెట్లు పెరిగి 35,980 యూనిట్లు, ముంబైలో 67 శాతం పెరిగి 81,315 యూనిట్లు, బెంగళూరులో 81 శాతం వృద్ధితో 37,645 యూనిట్లు, పూణెలో 69 శాతం పెరిగి 40,598 యూనిట్లు, చెన్నైలో 57 శాతం పెరిగి 12,290 యూనిట్లకు చేరుకున్నాయి. కోల్‌కతాలో సైతం 15,743 యూనిట్లతో ఇళ్ల అమ్మకాలు రెండు రెట్లు పెరిగాయి. ప్రస్తుతం పండుగ సీజన్ నేపథ్యంలో ఈ ధోరణి కొనసాగుతుందని అనరాక్ ఛైర్మన్ అనుజ్ పూరి అన్నారు.


Next Story

Most Viewed