- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: కేంద్రానికి ఆర్బీఐ నుంచి రికార్డు స్థాయి డివిడెండ్
చరిత్రలో మొదటిసారిగా ఆర్బీఐ డివిడెండ్ రూ. 3 లక్షల కోట్ల మార్కును దాటవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ ఆర్థికవ్యవస్థలో ఈ వారం కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కేంద్ర ప్రభుత్వానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) రికార్డు స్థాయిలో రూ. 3.16 లక్షల కోట్లకు పైన డివిడెండ్ను చెల్లించనున్నట్టు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. గతేడాది అందించిన రూ. 2.68 లక్షల కోట్ల రికార్డు స్థాయి చెల్లింపు కంటే, ఈసారి దాదాపు 20 శాతం అదనంగా నిధులు అందుతాయని అంచనా. అంటే, చరిత్రలో మొదటిసారిగా ఆర్బీఐ డివిడెండ్ రూ. 3 లక్షల కోట్ల మార్కును దాటవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఖరారు చేసేందుకు ఆర్బీఐ బోర్డు ఈ వారం చివరలో సమావేశం కానుంది.
ఆర్బీఐ నుంచి అందే ఈ భారీ డివిడెండ్తో పాటు ప్రభుత్వ రంగ సంస్థల డివిడెండ్లు కూడా కలిస్తే, ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో అంచనా వేసిన రూ. 3.16 లక్షల కోట్ల ఆదాయ లక్ష్యాన్ని మించిపోయే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దీంతో కేంద్రానికి అదనపు ద్రవ్య వెసులుబాటు లభించడమే కాకుండా, భారీగా అప్పులు తీసుకోకుండా వ్యయ ప్రణాళికలను కొనసాగించే అవకాశం ఉంటుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల్లో నెలకొన్న అస్థిరత భారత్ లాంటి దిగుమతి ఆధారిత దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి అనిశ్చిత సమయంలో ఆర్బీఐ నుంచి వచ్చే అదనపు ద్రవ్య వెసులుబాటు కేంద్రానికి 'ఫైనాన్షియల్ బఫర్'లా పనిచేస్తుంది.






