ఉద్యోగులపై నిఘా వ్యవహారంలో అమెజాన్‌కు రూ. 290 కోట్ల జరిమానా

by Dishanational1 |
ఉద్యోగులపై నిఘా వ్యవహారంలో అమెజాన్‌కు రూ. 290 కోట్ల జరిమానా
X

దిశ, బిజినెస్ బ్యూరో: రిటైల్ ఈ-కామర్స్ వ్యాపార దిగ్గజం అమెజాన్ భారీ జరిమానాను ఎదుర్కొంది. ఫ్రాన్స్ డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ సీఎన్ఐఎల్ ఉద్యోగుల పనితీరుపై హద్దు దాటి నిఘా ఉంచిన కారణంగా 32 మిలియన్ యూరోలు(భారత కరెన్సీలో సుమారు రూ. 290 కోట్లు) జరిమానా చెల్లించాలని ఆదేశాలిచ్చింది. యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ప్రకారం, ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, వినియోగం గురించి వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. దీనికి విరుద్ధంగా అమెజాన్ డేటాను సేకరించినట్టు సీఎన్ఐఎల్ ఆరోపణలు చేస్తోంది. ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు అందాయని, విచారణ తర్వాతే జరిమానా విధించినట్టు పేర్కొంది.

వినియోగదారులు ఆర్డర్ చేసే ప్యాకేజీలను ప్రాసెస్ చేయడానికి సిబ్బంది ఉపయోగించే స్కానర్‌ల ద్వారా కంపెనీ నిఘా ఉంచినట్టు సీఎన్ఐఎల్ తెలిపింది. 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం స్కానర్లు పనిచేయకపోతే మేనేజ్‌మెంట్‌కు అలర్ట్ మేసేజ్ పంపుతాయని, దాని ఆధారంగా ఉద్యోగుల పనితీరును కంపెనీ సమీక్షిస్తున్నట్టు వివరించింది. ఇది మాత్రమే కాకుండా ఉద్యోగులు పని ప్రదేశాల్లో ఎంతసేపు ఉంటున్నారనే సమాచారాన్ని కూడా సేకరిస్తున్నట్టు పేర్కొంది. ఈ విధమైన నిఘా వల్ల ఉద్యోగులు ఒత్తిడికి గురవుతారని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై అమెజాన్ స్పందించింది. వినియోగదారులకు మెరుగై సేవలందించేందుకు, ఉత్పత్తుల డెలివరీ విషయంలో సిబ్బంది పనితీరును తెలుసుకునేందుకు ఇలాంటి పద్దతి అవసరమని వివరణ ఇచ్చింది. ఉద్యోగులపై నిఘా కోసం డేటాను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలను ఖండించింది.


Next Story

Most Viewed